రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై కాగ్‌కి ఫిర్యాదు.. కేసు నమోదు

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై కాగ్‌కి ఫిర్యాదు.. కేసు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ వర్కింగ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మాజీ కార్పొరేషన్ చైర్మన్ బక్క జడ్సన్ మంగళవారం ఫిర్యాదును సమర్పించారు. ఫిర్యాదు స్వీకరించిన కాగ్ కార్యాలయం రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయించింది. 2023 మార్చి నుంచి రాష్ట్రంలో సుమారు 13,000 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎంకాష్‌మెంట్ వంటి చట్టబద్ధమైన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బడ్జెట్‌లో పెన్షన్ల కోసం కేటాయించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారని బక్క జడ్సన్ ఆరోపించారు. పెన్షన్ నిధులు అందక, ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్యం అందక ఇప్పటివరకు 41 మంది సీనియర్ సిటిజన్లు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. 2022-23 నుంచి 2025-26 వరకు పెన్షన్ నిధుల వినియోగంపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని కొరారు. నిధుల మళ్లింపుపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే వడ్డీతో సహా విడుదల చేయాలని స్పష్టం చేశారు.

Next Story