మహిళలు దేశాలను పాలిస్తున్నారు: పోలీస్ కమిషనర్

by Dishafeatures2 |
మహిళలు దేశాలను పాలిస్తున్నారు: పోలీస్ కమిషనర్
X

దిశ, సిద్దిపేట: ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలు రాజకీయ చైతన్యవంతులై దేశాలను పాలించ గలుగుతున్నారని, మహిళలను మరింత ప్రోత్సహిస్తే దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. లక్ష్యం సాధించాలన్న తపన, అకుంఠిత దీక్ష, కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉంటారని సీపీ శ్వేత అన్నారు. అందరిని ఉన్నత స్థానాల్లో నిలిపేది చదువు ఒక్కటేనని, చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు.

ఈ ప్రపంచంలో ఎవ్వరూ దొంగలించలేనిది చదువు ఒకటేనని, కుల మతాలకతీతంగా చదువుకొని ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ధైర్యం, లక్ష్యం ఉంటే చుట్టూ ఉన్న సమాజం కూడా మనల్ని చూసి గర్విస్తుంది అన్నారు. సోషల్ మీడియా ఇంటర్నెట్ ద్వారా మంచిని స్వీకరించి ఎంతోమంది అభివృద్ధి పదంలో నడుస్తున్నారని తెలిపారు. మంచి ప్రయోజనాలకు మాత్రమే మంచి ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా ఉపయోగించుకోవాలని సూచించారు.

మహిళ అనే పదంలో విలువ ఉందని, తల్లిగా, భార్యగా, ఆడబిడ్డగా జీవితాన్ని త్యాగం చేస్తూ సృష్టికి ప్రతి సృష్టి నిర్మిస్తున్న శక్తి మహిళ అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు విద్య, వైద్యం, సామాజిక, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి, సాంకేతిక రంగాల్లో పనిచేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం గర్వకారణమన్నారు .మహిళా శక్తికి మించింది ప్రపంచంలో ఏదీ లేదని ఆకాశంలో సగం అన్నిటా సగం అన్న పద్ధతిలో మహిళలు స్ఫూర్తితో ముందుకు కదలాలని సూచించారు.



Next Story

Most Viewed