CM Jagan: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినతులు

by Dishanational2 |
CM Jagan: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినతులు
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. రెండోరోజైన బుధవారం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై ప్రస్తావించారు. ముఖ్యంగా విశాఖ– భోగాపురం బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు.. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం వివరించారు. విశాఖనుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటకరంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ కోరారు.

విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని.. దీనికి సీఆర్డీయే గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని.. అలాగే రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వేల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం వైఎస్ జగన్ కోరారు.



Next Story