TRS ఫ్లీనరీపై సందిగ్ధం.. నేతలకు క్లారిటీ ఇవ్వని అధిష్టానం?

by Disha Web Desk 2 |
TRS ఫ్లీనరీపై సందిగ్ధం.. నేతలకు క్లారిటీ ఇవ్వని అధిష్టానం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం జెండా ఎగురవేతతోనే సరిపుచ్చుతారా? లేకుంటే ఫ్లీనరీ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారా? అనేదానిపై సందిగ్ధం నెలకొంది. మరో 11 రోజులు మాత్రమే గడువు ఉండటం, ఇప్పటివరకు రాష్ట్ర కమిటీకి గానీ, పార్టీ నేతలకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ నిర్వహణపై ఎలాంటి సమాచారం రాలేదు.

తెలంగాణ సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ఆవిర్భవించింది. నాటినుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీ జరగడం ఆనవాయితీ. ఈ వేదికగా పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తుంటారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, సభ్యత్వాల నమోదు తదితర అంశాలపై దిశానిర్దేశం చేయడంతో పాటు చేపట్టే అంశాలపై యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారు. వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల కోసం ఇచ్చిన హామీల అమలు, పార్టీ చిత్తశుద్ధి కార్యాచరణ తదితరాలను కూడా ప్రస్తావిస్తుంటారు. అయితే గత మూడేళ్లుగా ప్లీనరీ జరగడంలేదు. ఈసారి జరిపేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఉనికిలోకి వచ్చి 21 ఏళ్లు అవుతుండటంతో గతంలో ఎన్నడూ జరగనంత గొప్పగా జరిగేలా చేస్తారా? లేకుంటే మమా అని పిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వరుసగా మూడేళ్ల నుంచి ప్లీనరీ వాయిదా పడింది. కానీ, 2021 అక్టోబర్ 25న మాత్రం నిర్వహించింది. 6 లక్షల మందితో ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికీ కోవిడ్ నేపథ్యంలో సుమారు 6 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించింది. ఆ ప్లీనరీని హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. గత అక్టోబర్‌లో ప్లీనరీ నిర్వహించడంతో మళ్లీ 6 నెలల వ్యవధిలోనే పార్టీ ఆవిర్భావం దినోత్సవం వస్తుంది. అయితే, ఇంకా పార్టీ వర్గాలకు నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే 2019లో లోక్‌సభ ఎన్నికల కారణంగా ప్లీనరీని పార్టీ నిర్వహించలేకపోయింది. 2020, 2021లో కరోనా కారణంగా వాయిదా పడిన ప్లీనరీని ఇప్పుడు ఘనంగా నిర్వహిస్తారా లేదా? అనేది మాత్రం మరో కొద్ది రోజుల్లోనే తేటతెల్లం కానుంది.

రాబోయే ఎన్నికల నేపథ్యంలో...

అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఇప్పటికే ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొంత అసంతృప్తి నెలకొంది. వాటన్నింటినీ చెక్ పెట్టాలంటే ప్లీనరీ నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి. గత అక్టోబర్ 25న ప్లీనరీ నిర్వహించినప్పటికీ పరిమిత సంఖ్యలో నిర్వహించడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం నెలకొంది. పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉండటంతో 6 లక్షల మందితో ప్లీనరీ నిర్వహించి వారిలో నూతనోత్సాహం నింపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పార్టీ మాత్రం నేటివరకు నిర్వహణపై ఎలాంటి ప్రకటనను అధికారంగా గానీ, పార్టీ నేతలకు గానీ పేర్కొనలేదు. పార్టీ శ్రేణుల్లో మాత్రం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. గ్రామ స్థాయి నుంచి జెండాలను ఎగురవేసి మిన్నకుంటారా? లేకుంటే ఘనంగా ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తారా అనేది చూడాలి.


Next Story

Most Viewed