IPL మీడియా రైట్స్ వేలం.. టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ

by Disha Web Desk 13 |
IPL మీడియా రైట్స్ వేలం.. టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ
X

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులకు సంబంధించి వేలం నిర్వహించేందుకు బీసీసీఐ టెండర్లను ఆహ్వానిస్తోంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసినట్లు మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదు నెలలు ఆలస్యం తర్వాత ఎట్టకేలకు 2023-27 సీజన్ కోసం జూన్ 12న జరిగే ఈ-వేలంలో కంపెనీలు రూ.25 లక్షలకు ఐటీటీ డాక్యుమెంట్‌లను పొందవచ్చని పేర్కొంది.


ఈ టెండర్‌ ప్రక్రియలో 4 నుంచి 5 ప్యాకేజీల హక్కులు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ 2023-27 కాల పరిమితికి సంబంధించిన మీడియా హక్కుల కోసం బీసీసీఐ రూ.16,000 కోట్లకు పైగా ఆశిస్తోంది. గతంలో 2018-22 వరకు స్టార్ ఇండియా నుంచి మీడియా హక్కుల కోసం బీసీసీఐ అత్యధికంగా రూ.16,000 కోట్లను అందుకుంది.

ప్యాకేజీ వివరాలు:

ఐపీఎల్ గ్లోబల్ రైట్స్ టెలివిజన్ - ప్యాకేజీ A, డిజిటల్ హక్కులు- గ్లోబల్- ప్యాకేజీ B, మిగిలిన ప్రపంచ హక్కులు (ప్రసారం/ డిజిటల్ రెండూ)- ప్యాకేజీ సి, టెలివిజన్ హక్కుల ఉపఖండం - ప్యాకేజీ D, డిజిటల్ హక్కుల ఉపఖండం - ప్యాకేజీ E కింద డివైడ్ చేశారు.

ఇక టెండర్ ప్రాసెసింగ్ విధానం, కంపెనీల అర్హతలు, బిడ్‌ల సమర్పణల ప్రక్రియ, ప్రతిపాదిత మీడియా హక్కుల ప్యాకేజీలు, బాధ్యతలు మొదలైన వాటితో సహా టెండర్ ప్రక్రియను నియంత్రించే వివరణాత్మక నిబంధనలను 'టెండర్ ఆహ్వానం' ఐటీటీలో పొందుపరిచారు.


ఇందులో ముఖ్యంగా తిరిగి చెల్లించలేని సొమ్ము రూ.25 లక్షలు, జీఎస్టీ పన్ను కూడా కలిపారు. దీనిని ప్యాకేజీ A లో నమోదు చేశారు. 10 మే 2022 వరకు ఐటీటీ కొనుగోలుకు సంబంధించి ప్రక్రియ అందుబాటులో ఉంటుందని బీసీసీఐ తెలిపింది.

బిడ్ వేయదలుచుకునే వారు ఎవరైనా ఐటీటీని తప్పుకుండా కొనుగోలు చేయాలి. దీని నిబంధనలు, షరతులను ఫుల్ ఫిల్ చేసిన వారు మాత్రమే బిడ్ చేయడానికి అర్హులు. కేవలం టెండర్ ఐటీటీ డాక్యుమెంట్స్ కొనుగోలు చేశాం కదా అని వేలంలో పాల్గొనే అర్హత ఎవరికీ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.


ఈ టెండర్ ప్రక్రియ 45-60 రోజుల వ్యవధిలో పూర్తవుతుండగా, జూన్ 12న ఈ-వేలం నిర్వహించడానికి తాత్కాలిక తేదీగా ప్రకటించారు. కాగా, అంతర్గత మూల్యాంకనం ప్రకారం ఈసారి ఐపీఎల్ డిజిటల్ హక్కుల విలువ ప్రసార హక్కులు (చానెళ్ల) విలువలతో సరిపోలుతుందని బీసీసీఐ భావిస్తోంది.



Next Story