బంగ్లాదేశ్‌లో రాధాకృష్ణ టెంపుల్‌పై మూకదాడి.. విగ్రహాలు, నగదు అపహరణ

by Disha Web Desk 17 |
బంగ్లాదేశ్‌లో రాధాకృష్ణ టెంపుల్‌పై మూకదాడి.. విగ్రహాలు, నగదు అపహరణ
X

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ రాధాకృష్ణ టెంపుల్ పై ఓ వర్గానికి చెందిన సుమారు 200 మంది దాడికి పాల్పడ్డారు. ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు అందులోని దేవతామూర్తుల విగ్రహాలు, విలువైన వస్తువులు, నగదును దోచుకున్నారు. అంతేకాకుండా అడ్డు వచ్చిన ముగ్గురు ఆలయ సిబ్బంది పై దాడికి పాల్పడటంతో వారు గాయాలపాలై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దాడికి సంబంధించి షాకింగ్ చిత్రాలను బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) కూడా తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్పందిస్తూ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.

హాజీ షాఫుల్లా నేతృత్వంలో సుమారు 200 మంది ఢాకాలోని 22 లాల్ మోహన్ వీధిలో గల ఇస్కాన్ టెంపుల్‌పై మార్చి 17 రాత్రి 8 గంటల ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని పేర్కొంది. కాగా, ఆలయంపై జరిగిన దాడిపై ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధా రామ్ దాస్ స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం రాత్రి గౌర పూర్ణిమ సందర్భంగా భక్తులు ఆ ఏర్పాట్లలో ఉండగా ఒకేసారి వందల సంఖ్యలో ఓ వర్గానికి చెందిన గుంపు వచ్చి దాడి చేసిందని చెప్పారు.ఈ దుశ్చర్యపై బంగ్లా ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇక్కడి హిందూ మైనార్టీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో కూడా హిందూ దేవాలయాలపై ఇలాగే వరుస దాడులు జరిగాయని, మూకదాడుల్లో ఒకరు మరణించారని గుర్తుచేశారు. బంగ్లాలోని మైనార్టీలపై, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్యసమితి స్పందించాలని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు.





Next Story

Most Viewed