317 జీవోతో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి!

by Disha Web Desk 13 |
317 జీవోతో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జీవో 317 ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానికత కోల్పోయిన సుమారు 700 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్ డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన డిటిఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. శంతన్ మాట్లాడుతూ.. రాజస్థాన్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసిన విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా రద్దు కొరకు తగునిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏడేళ్లుగా నిలిచిపోయిన అన్ని కేటగిరీల పదోన్నతులు తక్షణమే చేపట్టాలని, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం బలోపేతానికి కృషి చేయాలని, జాతీయ నూతన విద్యా విధానం విషయమై మేధావులతో చర్చించి తగు మార్పులు చేర్పులతో రాష్ట్రంలో అమలుపరచాలని కోరారు. పరస్పర బదిలీలకు సంబంధించి వెలువరించిన జీవో 21 ని సవరించి అమలు జరపాలని శంతన్ డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రాజన్న, ఉపాధ్యక్షులు దాస్, కార్యదర్శులు రాందాస్ ,అరుణ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు విజయరామరాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story