బీజేపీకి వివేక్, కోమటిరెడ్డి, విజయశాంతి గుడ్ బై.. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం?

by Disha Web Desk 2 |
బీజేపీకి వివేక్, కోమటిరెడ్డి, విజయశాంతి గుడ్ బై.. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు పదునెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఇప్పటికే ఎన్నికల కదనరంగంలోకి దిగిపోగా పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ సభతో బీజేపీ సైతం ఎన్నికల సమర శంఖం పూరించింది. ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ ప్రజలపై ప్రధాని హామీల వర్షం కురిపిస్తూనే బీఆర్ఎస్‌పై విమర్శల దాడికి దిగారు. దీంతో ఇక రాష్ట్రంలో కమలం దూకుడు ఖాయం అనుకునే లోపు బీజేపీలోని ఓ వర్గం వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలాల్లో చర్చనీయాశంగా మారింది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ సభ అంటే దానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ సభలో కనిపించేందుకు నేతలతో పాటు సామాన్య కార్యకర్త సైతం ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటిది నిన్న జరిగిన మోడీ సభకు బీజేపీలో ముఖ్యమైన నేతలుగా ఉన్న ఎంపీ సోయం బాపురావు, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్‌లు డుమ్మా కొట్టడం కమలం పార్టీలో కలకలం రేపుతున్నది.

పార్టీ మారేందుకు రంగం సిద్ధం?:

ఇటీవల జరుగుతున్న పరిణామాలపై టీ.బీజేపీలోని ఓ వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పలువురు నేతలు బహిరంగంగానే పార్టీ తీరును తప్పుబడుతూ వస్తున్నారు. దాదాపు 10 మందితో కూడిన అసంతృప్త వర్గం త్వరలో బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయం చూసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరంతా ఒకచోట సమావేశమై తమ భవిష్యత్ కార్యచరణపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే మోడీ సభతో అంతా దారికి వస్తుందనుకుంటునప్పటికీ అటుంటిదేమి లేదు అన్నట్లుగా అసంతృప్త శిబిరంలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వారిలో కొంత మంది నేతలు పాలమూరు మోడీ సభకు దూరంగా ఉండిపోయారు. దీంతో వీరంతా పార్టీ మారడం పక్కా అని అందుకోసమే ప్రధాని సభకు ఆబ్సెంట్ అయ్యారనే వాదనలు మరింత బలపడుతున్నాయి.

కాంగ్రెస్‌లోకి జంప్!

ప్రస్తుతం బీజేపీలో అసంతృప్తితో ఉన్న వారిలో మెజార్టీ నాయకులు బీఆర్ఎస్ ని ఓడించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరారు. అయితే బీఆర్ఎస్ పట్ల బీజేపీ కఠిన వైఖరి అనుసరించకపోవడం వల్లే వారంతా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీంతో తొలుత అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవాలని ప్రయత్నించినా అటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఇక పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే వీరంతా కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇదే సమయంలో టీపీసీసీ నిర్వహించిన సర్వేల్లో పలువురు బీజేపీ నేతలకు అనుకూలంగా ఫలితాలు రావడంతో వారిని కన్విన్స్ చేసి పార్టీలోకి చేర్చుకునేందుకు బ్యాంక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎంత మంది పార్టీ మారబోతున్నారు? ఒక వేళ పార్టీ మారితే ఎంత మంది కాంగ్రెస్‌లో చేరుతారు? మరెంత మంది బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.



Next Story

Most Viewed