ప్రాణాలు పోతుంటే చూశారే తప్ప.. పట్టించుకోలేదు: సీఎం కేసీఆర్

by Disha Web Desk 2 |
ప్రాణాలు పోతుంటే చూశారే తప్ప.. పట్టించుకోలేదు: సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఫ్లోరైడ్‌తో ఇక్కడి ప్రజల నడుములు వంగిపోతే పట్టించుకోనోడు.. ఇవాళ నన్ను ఛాలెంజ్‌ చేస్తున్నాడంటూ కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల తీర్పును మళ్లీ రిపీట్ చేయాలని.. మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశాం, వందపడకల హాస్పిటల్‌ నిర్మాణమవుతుంది, మిగతా పనులన్నీ మీ కండ్ల ముందే జరుగుతున్నాయ్ అని అన్నారు.

ఎన్నికలు రాగానే ఎవరూ ఆగమాగం కావొద్దు.. నేను మీమ్మల్ని కోరేది ఒక్కటే. గత ఎన్నికల్లోనూ కోరాను.. ఈసారి కూడా కోరేది ఏంటంటే.. ఎవరో ఏదో చెబితే క్యారీ ఫార్వర్డ్‌ అయిపోవద్దు. మనంగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. మునుగోడు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందున్న కాంగ్రెస్‌ 50-60 సంవత్సరాలు పరిపాలించినా ఇక్కడ నడుములు వంగిపోయేదాకా.. చచ్చిపోయేదాక చూశారే తప్పా ఫ్లోరైడ్‌ నివారణ కోసం కృషి చేయలేదు. అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో.. ఇక్కడి ఉద్యమకారులు స్వామి అనే పిల్లవాడిని ప్రధాని టేబుల్‌పై పడుకొబెట్టినా.. దానికి నివారణ దొరకలేదు. కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చాకనే ఫ్లోరైడ్‌ నీళ్ల గోస ఏ విధంగా పోయిందో మీ అందరికీ తెలుసని అన్నారు. రాజకీయాల్లో ఎవరైతే పనికి మాలిన వాళ్లు ఉంటరో.. డబ్బు మదంతో పని చేసేవారుంటారో.. వాళ్లకు బుద్ధి చెప్పకపోతే ప్రజలు గెలువరు.. ప్రజలు ఓడిపోతరని మనవి చేస్తున్నాను అని సీఎం కేసీఆర్ అన్నారు.


Next Story