‘మునుగోడు’లో నీరుగారిపోతున్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం!

by Disha Web Desk 2 |
‘మునుగోడు’లో నీరుగారిపోతున్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం!
X

దిశ, మునుగోడు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం అమల్లో సర్కార్ లక్ష్యం నీరుగారిపోతుంది. మునుగోడు మండలంలో రాయితీ గొర్రెలు రీసైకిల్ సాగుతున్నది. సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులకు ఎంత కాలం తర్వాత అమ్ముకోవచ్చు అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో దానిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గొర్రెలను స్వగ్రామానికి తీసుకొచ్చి అధికారులతో ఫొటో దిగి అదే రోజు సాయంత్రం వరకే వచ్చిన దారినే వెళ్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మునుగోడు మండలానికి వచ్చిన గొర్రెలు రాత్రికి రాత్రే డీసీఎంఎల్ లో తరలిస్తున్నారు. లబ్ధిదారులు గొర్రెలను తాము పెంచుకుంటామని ఆసక్తి చూపిన వారికి 16 గొర్రెలను ఇస్తున్నారు. అదేమిటని లబ్దిదారులు ప్రశ్నిస్తే ప్రభుత్వం అధికారులు మాకు యూనిట్ కు 1లక్ష 18వేలు మాత్రమే ఇస్తున్నారని ఆ ధరకు ఇన్నే గొర్రెలు వస్తాయని అక్కడ గొర్రెలు అమ్మేవాళ్ళు చెబుతుండంతో గొర్రెలను పెంచుకుంటాం అన్న లబ్ధిదారుల కంటే అమ్ముకునే లబ్ధిదారులకే ప్రాధాన్యతమిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అబాసు పాలవుతోంది. ప్రతి గ్రామంలో సంఘాలను ఏర్పాటు చేసి ఒక్కో లబ్ధిదారునికి 21 గొర్రెలు చొప్పున అందజేయాలి. కానీ పంపిణీ చేసిన గొర్రెల పెంపకం సజావుగా జరుగుతుందా లేదా పర్యవేక్షించేందుకు పర్యవేక్షణ కమిటీలు జాడే లేకపోవడంతో దళారులకు వరంగా మారింది. గొర్రెల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది నేటికి అమలు నోచుకోలేదు. అవి ఏర్పడేలోపే గొర్రెలన్నీ మాయమయ్యేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.

కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొందరు ఉపయోగించుకొని ఆర్థికంగా ముందడుగు వేస్తుంటే మరికొందరు మాత్రం పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకంలో కూడా ఇదే తీరు నడుస్తోంది. ప్రభుత్వం సబ్సిడితో కొనుగోలు చేసిన గొర్రెలు అనారోగ్యంతో ఉండడంతో లబ్ధిదారులు గొర్రెలను పెంచుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో దళారులకు గొర్రెల పథకం కాసుల వర్షం కురిపిస్తుంది. రెండో విడతగా మునుగోడు మండలంలో గొర్రెల పంపిణీ పథకాన్ని పెంపకం దారులకు సబ్సిడీపై అందించే కార్యక్రమం చేపట్టగా అధికారులు లబ్ధిదారులకు గొర్రెలు తెచ్చినట్లే తెచ్చి ఇచ్చినట్లు ఇచ్చి అదే రోజు రాత్రి అనేకచోట గొర్రెలు మాయమవుతున్నాయి. లబ్ధిదారులకు కొనిచ్చిన దళారులే మళ్లీ వాటిని తీసుకెళ్లడం తర్వాత మళ్లీ వేరే లబ్ధిదారులకు అవే గొర్రెలను పంపిణీ చేయడం వ్యాపారంగా ఎంచుకున్నారు.

మునుగోడు మండల వ్యాప్తంగా రెండో విడతగా 1906 మందిని గుర్తించగా సుమారు 1505 మంది వారి వాటగా రూ.43,750 డిడి తీసి సుమారు 18నెలలు కావోస్తుంది. అందులో 1040మందికి లబ్ధిదారుల ఒక్కోక్కరి ఖాతాలలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు జమచేసింది.ఇప్పటివరకు మండల వ్యాప్తంగా 700మంది లబ్ధిదారులకు పైగా గొర్రెలు పంపిణీ చేశారు.వాటిలో సూమారు 90శాతం మందికి పైగా అమ్ముకోవడం జరిగినట్లు సమాచారం. డీడీలు తీసిన వారి డబ్బులతో కలిపి మునుగోడు మండల వ్యాప్తంగా ఒక్కో యూనిట్ కు 1లక్ష75వేలు రూపాయలలో 1లక్ష58వేలు రూపాయలకు 20 గొర్రెలు, ఒక పొటేలు చొప్పున మొత్తం 21 జీవాలను అందించాల్సి ఉంది. మిగిలిన 17వేలు రూపాయలలో మెడికల్ కిట్స్, రవాణా సౌకర్యం, దాణా, బీమా అందిస్తున్నామని అధికారులు చేబుతున్నారు.

ఆంధ్రలోని ప్రకాశం,కడప,అనంతపురం జిల్లాలో నుండి గొర్రెలను కొనుగోలు చేయాలనే అధికారుల సూచన మేరకు వెళ్లిన లబ్ధిదారులకు నాణ్యతలేని గొర్రెలు, అనారోగ్యంతో ఉన్న గొర్రెలను చూపుతున్నారు. అయితే 1,58,000 యూనిట్ కు చెల్లించాల్సి ఉండగా 1,18,000 మాత్రమే చెల్లిస్తుండడంతో దళారులు చూపే గొర్రెలు అనారోగ్యంతో ఉన్న గొర్రెలని చూపుతున్నారు. నాణ్యతమైన, ఆరోగ్యంగా ఉన్న గొర్లు కావాలని రైతులు ప్రశ్నించగా మాకు ప్రభుత్వం 1లక్ష18వేలు మాత్రమే చెల్లిస్తుందని ఆ ధరకు ఇవే గొర్రెలు ఇస్తామని ఆరోగ్యమైన గొర్లు కావాలంటే అధిక డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గొర్ల కోసం వెళ్ళిన లబ్ధిదారులను రెండు,మూడు రోజులు అక్కడ తిప్పడంతో ఎక్కడ చూసిన అనారోగ్యమైన గొర్రెలను చూపడంతో చేసేదేమిలేక చూపిన గొర్రెలనే తెచ్చకుంటున్నారు. అయితే గొర్రెల కొనుగోలు కోసం ఉండే సహాయకులే అక్కడ చక్రం తిప్పుతున్నారనే అపవాదు ఉంది. అక్కడ గొర్రెలు అమ్మేవారి వద్దనే కొనేవారి వద్ద కమిషన్లు తీసుకోవడంతో పాటు తిరిగి మళ్లీ వాటిని అక్కడకు చేర్చి అదే గొర్రెలను ఇతర ప్రాంతంలోని లబ్ధిదారులకు పంపిస్తున్నారు.


Next Story

Most Viewed