కేసీఆర్ పాలనలో అప్పులు ఘనం,అభివృద్ధి శూన్యం.. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల

by Dishafeatures2 |
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ పాలనలో అప్పులు ఘనం,అభివృద్ధి శూన్యమని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల షర్మిల ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. 10 ఏళ్లుగా కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్రం దివాళా తీసిందని, పరిమితి మించి దొర తెచ్చిన అప్పులు అక్షరాల 5లక్షల కోట్ల రూపాయలు అని అన్నారు. ఇంత అప్పు చేసినా దేనికి డబ్బు లేదని, పథకాల నుంచి బిల్లుల చెల్లింపుల దాకా అన్ని బంద్ అయ్యాయని అన్నారు. ‘‘కాంట్రాక్టర్లకు బిల్లుల కింద రూ.37 వేల కోట్లు, డిస్కంలకు రూ. 25 వేల కోట్లు, ఆరోగ్యశ్రీకి వెయ్యి కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 5 వేల కోట్లు, సున్నా వడ్డీలకు 17వేల కోట్లు,ఆర్టీసీకి 4 వేల కోట్లు,రుణమాఫీ కింద 6 వేల కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే దొర బాకీల జాబితా చాంతాడు కన్నా పొడువే. అభివృద్ధికి అప్పులు తెస్తే తప్పా? అని అడిగే కేసీఆర్.. తెచ్చిన డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టినట్లు? ఎక్కడ అభివృద్ధి చేసినట్లు? నెల నెలా రాష్ట్ర ఆమ్దానీ ఎక్కడ పోతున్నట్లు?’’ అని ప్రశ్నించారు.

లక్షల కోట్లు అప్పులు తెచ్చి అర చేతిలో 3డీ చూపారని, కమీషన్ల కింద దొర ఖజానాకే నిధులు అన్ని దారి మళ్లాయని అన్నారు. పనికి రాని ప్రాజెక్ట్ చెప్పి తెచ్చిన అప్పులు దొర కడుపు నింపాయని, ఒక్కో తలపై రూ.2లక్షల అప్పు వేశారని మండిపడ్డారు. ఆఖరికి ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు. ఇప్పటికే 35 వేల ఎకరాల భూములు అమ్మిన దొర.. ఉన్న భూములు అమ్మితే తప్పా సర్కారును నడిపించలేని దుస్థితి నెలకొందని అన్నారు. పైకి ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్భాలు పలుకుతూనే.. తెలంగాణను మరో 40 ఏండ్లు కోలుకోలేని దెబ్బ తీశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బిందెకు బంగారు పూత.. ఇదే కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ అని షర్మిల ఎద్దేవా చేశారు.

Next Story