దళిత బంధు కాదు కమీషన్ల బంధు.. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల

by Dishafeatures2 |
దళిత బంధు కాదు కమీషన్ల బంధు.. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: రెండో విడత దళిత బంధుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. లబ్దిదారుల ఎంపికను ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కు అప్పజెప్పుతూ విధివిధానాలు స్పష్టం చేసింది. కాగా ఈ విషయంపై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల స్పందించారు. అది దళిత బంధు కాదని కమీషన్ల బంధు అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. దళిత బంధు పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేలు రాబందుల్లా తయారయ్యారన్న సీఎం కేసీఆర్.. లబ్దిదారుల ఎంపికను మళ్లీ ఎమ్మెల్యేలకే కట్టబెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్నికలకు ఎంత కావాలో అంత తినండని కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యేలకే లబ్దిదారుల ఎంపిక అధికారాన్ని ఇచ్చారని మండిపడ్డారు.

ఒక్కో నియోజకవర్గానికి 1100 మందిని ఈ పథకానికి ఎంపిక చేస్తున్నారని, ఆ లెక్కన చూసుకుంటే ఒక్కో ఎమ్మెల్యేకు కమీషన్ల కింద రూ. 55 కోట్లు ముడుతున్నాయని ఆరోపించారు. ఇక రాష్ట్రం మొత్తం కలిపితే 6 వేల కోట్ల కమీషన్లు ఎమ్మెల్యేలకు వస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. దళిత బిడ్డల పేరు చెప్పి ఎమ్మెల్యేలకు దోచి పెట్టే కుట్ర ఇది అని షర్మిల అన్నారు. దళిత బంధులో అవినీతి జరుగుతోందని సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తెలిపారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేల జోక్యాన్ని తగ్గించాలని, గ్రామ సభ పెట్టి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకుంటే వైఎస్ఆర్టీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed