కమీషన్లు రావనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వట్లే: కేసీఆర్‌పై షర్మిల ఫైర్

by Disha Web Desk 19 |
కమీషన్లు రావనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వట్లే: కేసీఆర్‌పై షర్మిల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అన్ని వర్గాలను మోసం చేసినట్లుగానే సీఎం కేసీఆర్ జర్నలిస్టులను సైతం మోసం చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తొమ్మిదేళ్ల బంగారు తెలంగాణలో జర్నలిస్టులు ఆందోళన చేయడం బాధాకరం అన్నారు. ఇండ్ల స్థలాల కోసం గురువారం ఇందిరా పార్క్ వద్ద జర్నలిస్టులు చేస్తున్న మహాధర్నాకు షర్మిల మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టులు సన్మానం చేయమని అడగలేదని కేవలం వారికి రావాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తే వారిని కేసీఆర్ విస్మరించడం అన్యాయం అని ధ్వజమెత్తారు. జర్నలిస్టులను కేసీఆర్ గతంలో సైనికులతో పోల్చారని, హైదరాబాద్ జర్నలిస్టులు అసూయపడేలా వరంగల్ జర్నలిస్టులకు కాలనీ నిర్మిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వానికి భూములు దొరుకుతున్నాయి కానీ జర్నలిస్టులకు ఇచ్చేందుకు భూములు కుదరడం లేదా అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తే కమీషన్లు రావనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలన జర్నలిస్టులకు కనీస మర్యాద కూడా లేకుండా పోయిందని తన పాదయాత్రలో జర్నలిస్టుల కష్టాలను చూశానన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని రాష్ట్రంలో స్వేచ్ఛగా వార్తలు రాసే పరిస్థితి కూడా లేదన్నారు. వైఎస్సార్ హయాంలో జర్నలిస్టులకు ఎంతో న్యాయం జరిగిందని 70 ఎకరాల జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీకి కేటాయించారని గుర్తు చేశారు.

అది కాస్తా కేసుల్లో చిక్కుకుంటే వైఎస్సార్ మరణం తర్వాత దానిని నాటి కాంగ్రెస్, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సొసైటీ భూముల కేసు సుప్రీంకోర్టులో గెలిచినా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రికి చిత్త శుద్ధి లేదని దుయ్యబట్టారు. జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించి వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఈ హామీని వైఎస్సార్ టీపీ మేనిఫెస్టోలో పెడుతామన్నారు. జర్నలిస్టుల పోరాటాటాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఒక్క ఫోన్ కొడితే మీ సమస్యల కోసం నేను పోరాటం చేస్తానని చెప్పారు. మాకు కేసులు కొత్తేం కాదని పోలీసుల చేత నామీద అనేక కేసులు పెట్టిస్తున్నారని తనను ఒక రోజు జైల్లో కూడా పెట్టారని అయినా వెనక్కి తగ్గబోమన్నారు. కేసీఅర్ ఒక నియంతృత్వ పోకడలపై పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు.

Also Read..

వైఎస్ షర్మిల పై కేసు నమోదు

Next Story