టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తాం.. ఆ పార్టీ చీఫ్ సంచలన ప్రకటన

by Disha Web Desk |
టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తాం.. ఆ పార్టీ చీఫ్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి రోజే అవినీతిలో కూరుకుపోయి, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన ప్రస్తుత టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమైన 12 హామీలు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగిస్తామని, పేపర్ లీకేజీలకు పాల్పడ్డ చైర్మన్, సభ్యులను, కీలక ఉద్యోగులను విచారించి చట్టప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు.

ప్రతి ఏడాది మెగా డీఎస్సీతో సహా రాష్ట్రంలో ఖాళీలు ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డ వారిపై నేరాలు ఋజువైతే భవిష్యత్తులో సెంట్రల్ & స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయకుండా జీవితకాలం నిషేధం విధిస్తామన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు మేధావులు, విద్యావేత్తలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని మాత్రమే చైర్మన్, బోర్డు సభ్యులుగా నియమిస్తామన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులకు టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యులుగా నియమించకుండా నిబంధనలను కఠినతరం చేస్తామన్నారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలను అత్యాధునిక బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పాటు ఎన్‌క్రిప్షన్ & డిక్రిప్షన్ టెక్నాలజీతో డేటాబేస్‌లో పేపర్ లీకేజీలకు తావులేకుండా నిక్షిప్తంగా భద్రపరుస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లకు, రాజకీయ వివాదాలు, కోర్టు వివాదాలు లేకుండా, కట్టుదిట్టంగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి, పరీక్షలు నిర్వహిస్తామన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులపై నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తాం. ప్రత్యేక “ఇంటర్నల్ విజిలెన్స్" ఏర్పాటు చేస్తామన్నారు. గ్రూప్స్ ఉద్యోగాలకు వయోపరిమితి మరో 5 ఏళ్లకు పెంచుతామని నిరుద్యోగులకు హామీలు ఇచ్చారు.

Next Story

Most Viewed