Harish Rao : బనకచర్లపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : హరీష్ రావు

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్(AP) ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram-Banakacharla Project)కు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం ఏపీకి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

Harish Rao : బనకచర్లపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(AP) ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram-Banakacharla Project)కు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం ఏపీకి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్వాగతించారు. కేంద్ర జలసంఘం(CWC), ప్రాజెక్టు గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పును(GWDT) పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ, నాయకులు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి వివరాలు, ఆధారాలతో నిలదీయడం వల్లే కేంద్రం దిగివచ్చిందని పేర్కొన్నారు. ఇది తమ పార్టీతోపాటు తెలంగాణ ప్రజల విజయం అని అన్నారు. బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు అని తెలియజేశారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నామన్నారు హరీష్ రావు.

కాగా పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్(GWDT) అవార్డు పరిశీలించాల్సి ఉందని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తెలిపింది. కేంద్ర జలసంఘం(CWC)తో సంప్రదింపులు జరపడం అత్యవసరమని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు GWDT తీర్పును ఉల్లంఘించినట్లవుతుందని ఫిర్యాదులు వచ్చాయ ఏపీకి తెలియజేస్తూ.. అనుమతులు ఇవ్వలేమని తెలిపింది.

Next Story