తెలంగాణలో గ్యారంటీలు అమలు చేశాం.. పుదుచ్చేరిలోనూ చేస్తాం : భట్టి హామీ

by Ramesh Naini |

ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగం మనకు కల్పించిన గౌరవం, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమి బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

తెలంగాణలో గ్యారంటీలు అమలు చేశాం.. పుదుచ్చేరిలోనూ చేస్తాం : భట్టి హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగం మనకు కల్పించిన గౌరవం, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమి బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో​ కలిసి పుదుచ్చేరిలోని మనవేలి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అనంతరామన్‌కు, ఎం బాలం నియోజకవర్గం అభ్యర్థిగా నిలిచిన లక్ష్మీకాంత న్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి పుదుచ్చేరిని రక్షించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలతో కూడిన కూటమి ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. మా కూటమి హామీల అమలుపై ఎన్డీఏ కూటమి చేస్తున్న అసత్యాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దన్నారు. పుదుచ్చేరి బంగారు భవిష్యత్తుకు తమ కూటమిని గెలిపించడం ఒక్కటే పరిష్కార మార్గం అన్నారు. గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొంద‌రు సందేహాలు వ్యక్తం చేస్తున్నార‌ని దానికి స‌మాధానం తెలంగాణ రాష్ట్రమే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ స‌మావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 ల‌క్షల రైతు కుటుంబాల‌కు చెందిన రూ.21 వేల కోట్ల రుణాల‌ను తాము మాఫీ చేశామ‌ని, సాగు చేసుకునే రైతుల‌కు ఎక‌రాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భ‌రోసా కింద అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు.

67,173 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం

67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయ‌డంతో పాటు ప్రజ‌ల స‌మ‌క్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని వివ‌రించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించామ‌ని, 10 వేల‌ బస్సులు, 50 వేల‌ సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామన్నారు. ఉచిత బ‌స్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వ‌ర‌కు ఆదా అవుతోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామ‌ని వెల్లడించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామ‌న్నారు. మ‌హిళ‌ల‌ను బస్సుల యజమానులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామ‌ని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ -2047 ప్ర‌కారం తెలంగాణ‌ను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవ‌స్థగా నిల‌ప‌నున్నామ‌ని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉంద‌ని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని వెల్లడించారు.

Next Story