Warangal: గూడూరు ఘ‌ట‌న‌.. ఎస్ఐ రాణా ప్రతాప్ పై స‌స్పెన్షన్ వేటు?

by Ramesh Goud |

వాస్తవ ప‌రిస్థితుల‌ను తారుమారు చేస్తూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన ఎస్సై రాణాపై పోలీస్‌శాఖ స‌స్పెన్షన్ వేటు వేసిన‌ట్లు స‌మాచారం.

Warangal: గూడూరు ఘ‌ట‌న‌.. ఎస్ఐ రాణా ప్రతాప్ పై స‌స్పెన్షన్ వేటు?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వాస్తవ ప‌రిస్థితుల‌ను తారుమారు చేస్తూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన ఎస్సై రాణాపై పోలీస్‌శాఖ స‌స్పెన్షన్ వేటు వేసిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు మండ‌ల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ గ‌తంలో మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌ల ఎస్సైగా ప‌నిచేశారు. పొలం దున్నుతుండ‌గా ట్రాక్టర్ తిర‌బ‌డిన ఘ‌ట‌న‌లో గ‌ణేష్ అనే బాలుడు అక్కడిక‌క్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ అధికార వ‌ర్గాల నుంచి విశ్వస‌నీయ స‌మాచారం ప్రకారం.. ఈఘ‌ట‌న 2023 ఆగ‌స్టు నెల 4వతేదీన గూడూరు మండ‌లం మ‌ర్రిమిట్ట శివారు తోట‌ద‌స్రుతండాకు స‌మీపంలోని జ‌మ్మికుంట చెరువు తండాలో జ‌రిగింది. మైన‌ర్‌గా ఉన్న గ‌ణేష్‌ను డ్రైవ‌ర్‌గా నియ‌మించుకోవ‌డంతో ఈ చ‌ట్టప‌ర‌మైన శిక్షను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని గ్రహించిన స‌ద‌రు ట్రాక్టర్ య‌జ‌మాని ఎస్సై రాణాప్రతాప్‌ను ఆశ్రయించాడు.

దీంతో క్రైం సీన్ వాస్తవ ప‌రిస్థితుల‌ను పూర్తిగా మార్చేస్తూ ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. లైసెన్స్ క‌లిగి ఉన్న ట్రాక్టర్ య‌జ‌మాని పొలం దున్నుతుండ‌గా అక్కడికి వ‌చ్చిన గ‌ణేష్‌ ప్రమాద‌వశాత్తు ట్రాక్టర్ కింద‌ప‌డి చ‌నిపోయిన‌ట్లుగా న‌మోదు చేశారు. ఎస్సై వాస్తవ ప‌రిస్థితుల‌ను మార్చి వేస్తూ ఎఫ్ ఐఆర్‌ను న‌మోదు చేయ‌డంపై విమ‌ర్శలు వినిపించాయి. ప్రత్యక్షంగా అనేక మంది ముందు జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఎఫ్ఐఆర్‌లో త‌ప్పుగా న‌మోదైదంటూ విమ‌ర్శలు రావ‌డంతో పోలీస్‌శాఖ విచార‌ణ‌కు ఆదేశించింది.ఈ ఎంక్వైరీలో ఎస్ ఐ రాణా య‌జ‌మానిని శిక్ష నుంచి త‌ప్పించేందుకే ఎఫ్ఐఆర్‌లో ఘ‌ట‌న‌ను పూర్తిగా మార్చివేస్తూ కేసు గ‌తిని మార్చేశారని తేలింద‌ని స‌మాచారం. అయితే గూడూరు నుంచి భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి బ‌దిలీ అయి జూలూరుపాడు పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సైగా విధుల్లో ఉన్న రాణాపై దాదాపు 16 నెల‌ల త‌ర్వాత వేటుకు రంగం సిద్ధమ‌వ‌డం గ‌మ‌నార్హం. అయితే ఎస్సై రాణాపై చ‌ర్యలు తీసుకున్న విష‌యంపై పోలీస్‌శాఖ స్పష్టత ఇవ్వక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న ఇప్పుడు పోలీస్‌శాఖలో చ‌ర్చనీయాంశంగా మారింది.

Next Story