మహబూబాబాద్ జిల్లాలో ఖబ్జా అవుతున్న వక్ఫ్ బోర్డు భూములు

by Disha Web Desk 12 |
మహబూబాబాద్ జిల్లాలో ఖబ్జా అవుతున్న వక్ఫ్ బోర్డు భూములు
X

దిశ ప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు వందల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయి. జిల్లాలో వక్ఫ్ బోర్డు భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో కనపడకపోవడంతో ఎంతో విలువైన భూములను కొంత‌మంది ఆక్ర‌మించేస్తున్నారు. రాజకీయ బలం, అధికారుల వత్తాసుతో కబ్జాదారులు ఈ భూములను విక్రయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో దర్గా, మసీదు, ఈద్గా, అశుర్ ఖానా, ఖజాయత్, ఖ‌బరస్తాన్ భూములు ఉన్నాయి. వక్ఫ్ చట్టం 1951 అమల్లోకి రావడంతో బోర్డు పరిధిలోని భూములను 1953లో ఖాస్రా పహనీలో అప్పట్లో నమోదు చేశారు. రికార్డుల్లో నమోదైన‌ప్ప‌టికీ కొంతమంది ఆ భూములను విక్రయించుకున్నారు.

ధరణిలో దక్కని చోటు..

జిల్లా పరిధిలోని వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన పూర్తి వివరాలు ధరణిలో నమోదు కాకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు, కబ్జాదారులు సులభంగా చేజిక్కుంచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల భూములు ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఈ భూముల సర్వే నంబర్లు నిషేధిత భూముల జాబితాలో లేకపోవడం మూలంగానే అన్యాక్రాంతమవుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.

ఎక్కడేక్కడ.. ఎంతెంత అంటే..

మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాలకు గాను దాదాపు అన్ని మండలాల్లో వక్ఫ్ బోర్డుల భూములు ఉన్నాయి. కాగా, ఉన్న వాటిలో సగానికి పైగా కబ్జాకు గురవగా, మరికొన్ని మండలాల్లో కబ్జాకు సిద్ధంగా ఉన్నాయి. డోర్నకల్‌లో సర్వే నంబర్ 147లో రెండు ఎకరాలు, ఇదే మండల పరిధిలోని గొల్ల చర్ల గ్రామంలో సర్వే నెంబర్ 352/బీలో ఎకరం, ఉయ్యాలవాడ గ్రామంలోని సర్వేనెంబర్ 215 లో 19 గుంటలు ఉన్నాయి. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో సర్వేనెంబర్ 551 లో 4.04ఎకరాలు, సర్వే నెంబర్ 698 లో 2.03ఎకరాలు, కేసముద్రం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 560, 539, 536 లలో 1.16 ఎకరాలు ఉంది.

తాళ్లపూసపల్లిలోని సర్వే నంబర్ 371, 1, 2, 3, 4, 5, 7లోని 8ఎకరాలు తొర్రూర్‌లో సర్వే నంబర్ 130/ఎఫ్‌లో ఎకరం, గార్ల మండలంలోని సర్వే నంబర్‌ 236, 592/1లో పలు సర్వే నంబర్ లోని 20 ఎకరాల భూమి ఉంది. కాగా, దీనిలో 10 ఎకరాలు, కురవి మండలంలోని గుండ్రాతి మడుగు గ్రామంలో సర్వే నెంబర్ 352 లో ఎకరం భూమి అన్యాక్రాంతమైనట్లు వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కమిటీ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది.

జాయింట్ సర్వే చేస్తున్నాం

భూముల అన్యాక్రాంతంపై జిల్లా వ్యాప్తంగా జాయింట్ సర్వే చేస్తున్నాం. ఎవరైనా భూములు ఆక్రమించినా విక్రయించినా చర్యలు తీసుకుంటాం.- సయ్యద్ జమిరోద్దీన్, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నరు..

జిల్లాలో వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతంపై సదరు వ్యక్తులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఖాళీ స్థలాలు కనపడితే కబ్జా చేస్తున్నారు. రానున్న తరాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలి. - షకీల్, పరిరక్షణ కమిటీ సభ్యుడు, మహబూబాబాద్

ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించినా, అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అధికారులు ధరణి పోర్టల్‌లో బోర్డు భూములకు లాక్ పెట్టాలి. రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలి.- ఎండీ అఖిల్ ఉల్లా, వక్ఫ్ బోర్డు పరిరక్షణ కమిటీ సభ్యుడు, మహబూబాబాద్



Next Story

Most Viewed