సత్తాచాటిన బాక్సర్లు.. ఆసియా చాంపియన్‌షిప్‌లో 7 స్వర్ణాలు

by Dishanational3 |
సత్తాచాటిన బాక్సర్లు.. ఆసియా చాంపియన్‌షిప్‌లో 7 స్వర్ణాలు
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా అండర్-22 అండ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌‌ను భారత బాక్సర్లు ఘనంగా ముగించారు. మంగళవారం అండర్-22 విభాగంలో ఏడు స్వర్ణాలు దక్కాయి. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రీతి(54 కేజీలు)తోపాటు విశ్వనాథ్ సురేశ్(48 కేజీలు), నిఖిల్(57 కేజీలు), ఆకాశ్(60 కేజీలు), పూనమ్ పూనియా(57 కేజీలు), ప్రాచి(63 కేజీలు), ముస్కాన్(75 కేజీలు) తమ విభాగాల్లో జరిగిన ఫైనల్స్‌లో విజయాలు సాధించి చాంపియన్‌గా నిలిచారు.

విశ్వనాథన్ 5-0 తేడాతో కరాప్ యెర్నార్‌పై, ఆకాశ్ 4-1 తేడాతో రుస్లాన్‌పై నెగ్గగా.. సబిర్ యెర్బోలాట్‌ను నిఖిల్ చిత్తు చేశాడు. బజరోవా ఎలినాపై ప్రీతి విజయం సాధించగా.. పూనమ్ పూనియా 4-1 తేడాతో సాక్ష్ అనెల్‌పై, అంతే తేడాతో అనార్ టర్సిన్బెక్‌పై ప్రాచి నెగ్గింది. భారత బాక్సర్లందరూ ఫైనల్‌లో ఆతిథ్య కజకిస్తాన్ బాక్సర్లనే ఓడించారు. ప్రీతి మాలిక్(67 కేజీలు), గుడ్డి(48 కేజీలు), తమన్నా(50 కేజీలు), సనేహ్(70 కేజీలు), అల్ఫియా పఠాన్(81 కేజీలు) ఫైనల్‌లో ఓడి రజత పతకాలతో సరిపెట్టారు. సోమవారం యూత్ విభాగంలో ఐదు స్వర్ణాలు దక్కిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ 43 పతకాలు సాధించింది. అందులో 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్య పతకాలు ఉన్నాయి. మెడల్స్ టేబుల్‌లో కజకిస్తాన్(48) అగ్రస్థానంలో నిలువగా.. భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.

Next Story

Most Viewed