ప్రధాని దిష్టిబొమ్మను తన్నుకుంటూ కాల్చండి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

by Web Desk |
ప్రధాని దిష్టిబొమ్మను తన్నుకుంటూ కాల్చండి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వరంగల్ టౌన్: తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచిన ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను తన్నుకుంటూ.. తొక్కుకుంటూ.. కాల్చండని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లతో కలిసి బైక్ ర్యాలీ చేశారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఆనందంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి దీక్ష చేయడం, 1200ల మంది విద్యార్థుల ఆత్మబలిదానాల వల్ల రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అలాంటి మహత్తర పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ వేదికగా ప్రధాని అపహస్యం చేయడం సరైంది కాదని అన్నారు. సుష్మా స్వరాజ్ గంటసేపు తెలంగాణ గురించి పార్లమెంట్‌లో మాట్లాడిన విషయం తెలుసుకోవాలని ప్రధానికి సూచించారు. నాడు పార్లమెంట్‌లో అద్వానీ, రాజ్యసభలో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఉన్నారన్నారు. వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ సభ్యులే అని, ఆ విషయం ప్రధానికి తెలియకపోవడం బాధాకరం అని ఎద్దేవా చేశారు. ''బిడ్డా.. నీకు చెబుతున్నాం, ఇవాళ తెలంగాణ ప్రజలను అవమాన పరిచినవ్. పార్లమెంట్ సాక్షిగా నిన్ను, నీ పార్టీని పార్లమెంటులో అడుగుపెట్టకుండా చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు'' అని ప్రధానిని హెచ్చరించారు.

అంతేగాక, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారన్నారు. అలాంటి సంక్షేమ పథకాలను దేశమతా అమలు చేయాలంటే ప్రజల పట్ల అభిమానం, దేశం పట్ల భక్తి ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ ఒక్కడికే సాధ్యం అని అభిప్రాయపడ్డారు. ''అలాగే రాష్ట్రంలో ఇద్దరు చెంచాగాళ్ళు ఉన్నారని, ఒకడు అరవింద్ కుమార్, మరొకడు బండి సంజయ్. వీళ్ళ ఇద్దరికీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వత్తాసుగా ఉన్నాడు. కిషన్ రెడ్డి ఖబడ్దార్. నువ్వు తెలంగాణ బిడ్డవైతే, రాష్ట్ర ప్రజానీకం మీద ప్రేమఉంటే మీ ప్రధానికి బుద్ధి చెప్పాలి.'' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదానీ, అంబానీ, మోడీ ముగ్గురు కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. అనంతరం నగర మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్‌లోనూ ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఫుర్ ఖాన్, కుమారస్వామి, ప్రవీణ్, నరేంద్ర, భాస్కర్, కవిత కార్యకర్తలు ఉన్నారు.


Next Story

Most Viewed