అండగా నిలిచిన సీపీ చిత్రపటానికి బాధిత రైతు పాలాభిషేకం..

by Disha Web Desk 11 |
అండగా నిలిచిన సీపీ చిత్రపటానికి బాధిత రైతు పాలాభిషేకం..
X

దిశ, నర్సంపేట: భూమి కొనుగోలు విషయంలో న్యాయం చేసిన వరంగల్ సీపీ రంగనాథ్ చిత్రపటానికి బాధిత రైతు కుటుంబం పాలాభిషేకం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరికి నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండేది. అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగల్ తండాకు చెందిన ఎస్బీఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018 లో అమ్మినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఎవరి హద్దుల్లో వారున్నారు. ఇదిలా ఉండగా.. కొద్ది కాలంగా మరో పది గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ వీరస్వామి కుటుంబాన్ని ఒత్తిడి చేస్తున్నారు.

ఈ క్రమంలో తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మబోమని తెగేసి చెప్పారు. ఇది మనసులో పెట్టుకున్న అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరి కొంత మందితో కలిసి బెదిరించడం మొదలెట్టారు. అంతటితో ఆగకుండా పొలాన్ని సైతం ధ్వంసం చేశారని, హద్దు రాళ్లు తొలగించారని బాధిత రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. తామే వారిని కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు సైతం చేశారన్నారు. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పామన్నారు.

సానుకూలంగా స్పందించిన సీపీ దీనిపై విచారణ చేయించినట్లు తెలిపారు. విచారణలో బాధిత రైతు కుటుంబం అన్యాయంగా వేధింపులకు గురైనట్లు తేలినట్లు చెప్పారు. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని సీపీ ఆదేశించారన్నారు. దీంతో 11 మందిపై నర్సంపేట పోలీసులు కేసులు నమోదు చేశారని వీరస్వామి తెలిపారు. భూమిని నమ్ముకొని, సాగు చేసుకొని బతికే తమకు సీపీ రంగనాథ్ సార్ న్యాయం చేశారని, అందుకే ఆయన చిత్రపటానికి పాలతో అభిషేకం చేశామని రైతు దంపతులు తెలిపారు.

Next Story

Most Viewed