మేడారం హుండీల్లో భక్తుల లేఖలు!

by velandi.Saikiran |

మేడారం జాతర హుండీ లెక్కింపులో భక్తుల కానుకలతోపాటు లేఖలు బయటపడుతున్నాయి. వన దేవతలు తమ కోర్కెలు తీర్చాలని, సమస్యలను పరిష్కరించాలని మొక్కుతూ భక్తులు లేఖలను హుండీలో వేశారు. అనుకున్నది జరిగితే మళ్లీ వచ్చి కానుకలు వేస్తామని, ఎత్తు బెల్లం పంచి పెడుతామని వాటిలో పేర్కొన్నారు.

మేడారం హుండీల్లో భక్తుల లేఖలు!
X

దిశ, వరంగల్ బ్యూరో : మేడారం జాతర హుండీ లెక్కింపులో భక్తుల కానుకలతోపాటు లేఖలు బయటపడుతున్నాయి. వన దేవతలు తమ కోర్కెలు తీర్చాలని, సమస్యలను పరిష్కరించాలని మొక్కుతూ భక్తులు లేఖలను హుండీలో వేశారు. అనుకున్నది జరిగితే మళ్లీ వచ్చి కానుకలు వేస్తామని, ఎత్తు బెల్లం పంచి పెడుతామని వాటిలో పేర్కొన్నారు. వీటిని చూసిన అధికారులు, ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో రెండు రోజులుగా హుండీల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం ఈసారి 788 హుండీలు ఉండగా ప్రతిరోజు 500 మంది సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు సాగుతోంది.

ఆస్తి రావాలి.. ప్రేమ పెళ్లి జరగాలి!..

తమకు గుర్తింపు లేకుండా ఉందని, తల్లిదండ్రుల ఆస్తి తిరిగి రావాలని, తాము ఉంటున్న ప్రాంతంలో ఇళ్లు కొనుగోలు చేసేవిధంగా చూడాలని.. ఇలా భక్తులు తమ తమ కోరికలను ఆయా లేఖల్లో రాసుకొచ్చారు. శివరాత్రి లోపు పూర్తయితే తమ ఎత్తు బెల్లాన్ని పంచిపెట్టడంతోపాటు మొక్కును తీర్చుకుంటానని రాసి హుండీలో వేశారు. ఓ భక్తుడు తమ కుటుంబాలు సంతోషంగా ఉండాలని, విడిపోయిన వారు కలవాలని, అందరూ ఒకటిగా ఉండాలని కోరాడు.

మరొకరు.. తాము వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నామని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకునేలాగా చూడాలని కానుకలతోపాటు లేఖలను హుండీలో వేశాడు. మరో భక్తుడు తాను కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని రూ. 13 కోట్ల బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం నిధులు విడుదల చేసే విధంగా చూడాలని కోరాడు. మరో భక్తుడైతే.. ప్రేమ వివాహం జరిగే విధంగా చూడాలని లేఖల్లో కోరుకున్నాడు. హుండీలో పదుల సంఖ్యలో వ్యక్తిగతంతోపాటు పలు సమస్యలపైన ఈ లేఖలు వస్తుండటంతో ఫైల్ చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు.

Next Story