మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అరెస్ట్

by Dishafeatures2 |
మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అరెస్ట్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లోనూ ఆయన ఆందోళన కొనసాగించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐదు సంవత్సరాల క్రితం తాను కలెక్టర్ గా ఉన్నప్పుడు నిర్మించిన 960 డబుల్ బెడ్ రూం ఇళ్ల‌ను పేదలకు కేటాయించాల‌ని పేర్కొంటూ లబ్ధిదారులతో క‌లసి ఆందోళ‌న నిర్వ‌హించేందుకు సోమ‌వారం ఆకునూరి ముర‌ళి భూపాల‌ప‌ల్లికి చేరుకున్నారు. ల‌బ్ధిదారుల‌తో భేటీ అయిన ముర‌ళిని పోలీసులు బ‌ల‌వంతంగా అరెస్ట్ చేసి.. స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేంత వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆయ‌న లబ్ధిదారులతో బైఠాయించారు. ఆకునూరి మురళికి మద్దతుగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు, మహిళలు వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు.


ఇక పోలీస్ స్టేషన్ లోకి వారంతా రాకుండా పోలీసులు స్టేషన్ గేట్లను లాక్ చేసి వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఆకునూరి మురళి లబ్ధిదారుల కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిరుపేదలకు ఇవ్వాలని ఆకునూరి మురళి పోరాటం మొదలు పెట్టారు. ఇదే విషయమై పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండలో ఒక్కదగ్గరే కట్టిన 592 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని అంతకుముందు అసహనం వ్యక్తం చేశారు. కట్టి 5సంవత్సరాలు అయినా పేదలకు కేటాయించడం లేదని, పక్కనే వేలమంది కిరాయి ఇండ్లల్లో గుడిసెలల్లో ఘోరమైన పేదరికంతో బతుకుతున్నారన్నారు. సీఎం ఈ ఇండ్లను పేదలకు వారం రోజులలో కేటాయించాల‌ని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed