ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

by Ratna Kumari |

మండలంలో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న జాప్యం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని భారతీయ జనతా పార్టీ నాయకులు మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
X

దిశ, భీమదేవరపల్లి : మండలంలో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న జాప్యం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని భారతీయ జనతా పార్టీ నాయకులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వోకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు అత్యంత మందగమనంగా సాగుతున్నాయని విమర్శించారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తరుగు, తేమ పేర్లతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఆపాలని, ఎలాంటి కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని ఐకేపీ కేంద్రాల్లో సరిపడా లారీలు ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని, ఎండలు మండుతున్న వేళ రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, మౌలిక వసతులు కూడా లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులకు నెలలు గడిచినా చెల్లింపులు ఖాతాల్లో జమ కాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు కష్టాన్ని ప్రభుత్వం గుర్తించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు దొంగల కొమురయ్య, భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామి, కొత్తకొండ సర్పంచ్ సిద్ధమల్ల రమారమేష్, జిల్లా నాయకుడు దొంగల వేణు, గుండెల్ని సదానందం, పోడేటి బిక్షపతి, ముద్దసాని వీరన్న, బొల్లంపల్లి శ్యామ్, గద్ద రాజేందర్, బొజ్జపురి పృథ్వీరాజ్, అయిత సాయి తేజ, పయ్యావుల రాజు, బోడ రమేష్ పాల్గొన్నారు.

Next Story