వరంగల్‌ బల్దియాలో అవినీతి ప్రావీణ్యులు!

by Disha Web Desk 12 |
వరంగల్‌ బల్దియాలో అవినీతి ప్రావీణ్యులు!
X

గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాపై అవినీతి ఆరోపణలు నిత్య కృత్యంగా మారాయి. ఇందుగలడు అందు లేదందువా అన్నట్లుగా అన్ని విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కొంతమంది అధికారుల చేతివాటంతో పాలనా వ్యవహారాలు గాడి తప్పుతున్నాయి. అధికారుల అక్రమాలతో సామాన్య ప్రజానీకం కష్టనష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి దాపురించింది. అవినీతి అధికారుల తీరుపై నగరవాసులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకం నుంచీ ప్రజలకు అవసరమైన ప్రతీ పనిలో అక్రమంగా డబ్బు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రధానంగా టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్, శానిటేషన్‌, ప్రజారోగ్య విభాగాలకు చెందిన కొందరు అధికారులు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాల్లో ప్రజలు బల్దియా కార్యాలయంలోనే అధికారుల తీరుపై దుమ్మెత్తిపోసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తమకు జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్‌సెల్‌లో మొరపెట్టుకున్నా పరిష్కారం లభించడం లేదని బాధితులు వాపోతున్నారు. అక్రమ వసూలు చేయడంలో అధికారులు ప్రావీణ్యులుగా మారారు. ఇప్పటికైనా అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

దిశ, వరంగల్‌ టౌన్‌: గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాపై అవినీతి ఆరోపణలు నిత్య కృత్యంగా మారాయి. ఇందుగలడు అందులేడందువా అన్నట్లుగా అన్ని విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతున్నదనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కేవలం కొంతమంది అధికారుల చేతివాటంతో పాలనా వ్యవహారాలు గాడి తప్పుతున్నాయి. అధికారుల అక్రమాలతో సామాన్య ప్రజానీకం కష్టనష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి దాపురించిందని నగరవాసులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకం నుంచీ ప్రజలకు అవసరమైన ప్రతీ పనిలో పలువురు అధికారులు అక్రమంగా డబ్బు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ప్రధానంగా టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్, శానిటేషన్‌, ప్రజారోగ్య విభాగాలకు చెందిన కొందరు అధికారులు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రజలు బల్దియా కార్యాలయంలోనే దుమ్మెత్తిపోసిన ఘటనలు చాలా ఉన్నాయి. అధికారుల తీరుతో తమకు అన్యాయం జరిగిందని గ్రీవెన్స్‌సెల్‌లో మొరపెట్టుకున్నా.. పరిష్కారం లభించడం లేదని బాధితులు వాపోతున్నారు.

ఆక్రమణదారులకు అండగా...

బల్దియా అధికారులు కొంతమంది భూ ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్‌ పొందాలనుకునే వారికి బల్దియా అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అందుకు ప్రతిఫలంగా లక్షల్లో అక్రమంగా వసూలు చేస్తున్నట్లు బల్దియాలో బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అలా అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించిన విషయంపై బాధితులు ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను ఆశ్రయిస్తుండడమే ఇందుకు నిదర్శనమని చర్చించుకుంటున్నారు. గ్రీవెన్స్‌సెల్‌కు చేరిన ఫిర్యాదులపై విచారణ చేపట్టేది కూడా తామేననే ధీమాతో సదరు అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందని విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలు దొంగలను వదిలి...

ఇంటి నంబర్ల కేటాయింపుపై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు చర్యలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, పుండు ఒక చోట ఉంటే మందు మరో చోట వేసినట్లుగా ఉన్నతాధికారుల చర్యలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలోని హన్మకొండలో 300 గజాల విషయంలో ఇరువర్గాల మధ్య తగువు నడుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాలు అదే జాగకు ఇంటి నంబర్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే బల్దియా అధికారులు ఇద్దరికీ నంబర్లు కేటాయించడం వివాదస్పదంగా మారింది. ఈ బాగోతంపై స్పందించిన బల్దియా బడా అధికారి ఒకరికి కేటాయించిన ఇంటి నంబర్‌ను రద్దు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఆ తప్పిదం ఎలా జరిగింది? అందుకు బాధ్యులు ఎవరు? అనే విషయాన్ని ఉన్నతాధికారి విస్మరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఇంటి నంబర్‌ ఎలా కేటాయిస్తారు? ఎప్పుడు కేటాయిస్తారు? అందుకు అధికారులు పరిశీలించాల్సిన అంశాలు ఏంటి? అనే కోణంలో విచారణ కొనసాగిస్తే.. అసలు దొంగలెవరు అనేది తేలిపోతుందని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్కరి విషయంలోనే కాదు, బల్దియా అధికారులు అడ్డగోలుగా క్షేత్రస్థాయిలో ఎటువంటి విచారణ, పరిశీలన చేపట్టకుండానే గుడ్డిగా నంబర్లు కేటాయిస్తూ అమాయక ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అక్రమాలకు పాల్పడే అధికారుల గుట్టు రట్టవుతుందని నగరవాసులు కోరుతున్నారు.

దొరికిన ఆగని దొంగ పనులు..

ఇప్పటికే బల్దియాలో అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిన ఘటనలు ఉన్నాయి. అయినా బల్దియా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో ఇంటి నంబర్‌ కేటాయింపు విషయంలో ఆర్‌ఐతోపాటు ఓ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డారు. అయినప్పటికీ ఇంటి నంబర్ల కేటాయింపుల్లో ఇప్పటికీ బల్దియా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఈ ఒక్క విభాగం, ఈ ఒక్క పనిలోనే కాదు, ప్రతి విభాగంలోనూ ప్రతి పనికీ ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేయడంలో ప్రావీణ్యులుగా మారారు. ఇప్పటికైనా అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story

Most Viewed