స‌బ్ స్టేష‌న్ల నిర్మాణాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి

by Ratna Kumari |

విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

స‌బ్ స్టేష‌న్ల నిర్మాణాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి
X

దిశ, వరంగల్ బ్యూరో : విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని తెలంగాణ ఎన్పిడిసీఎల్ ప్రధాన కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పెండింగ్ పనులు, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కులంకుశంగా చర్చించారు. జఫర్ గడ్ మండలం సాగరం, స్టేషన్ ఘనపూర్ మండలం కొండాపూర్, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి సబ్ స్టేషన్ లను మార్చి 10లోపు ప్రారంభోత్సవం చేయాలన్నారు. ఆ దిశగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. చిల్పూర్ మండలం లింగంపల్లి, నష్కల్, పల్లగుట్ట స్టేషన్ ఘనపూర్ మండలం నారాయణపురం సబ్ స్టేషన్లకు సంబందించిన ల్యాండ్ అలకేషన్ ను అతి త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఆర్డివో, తహసీల్దార్లకు ఆదేశాలు ఇస్తానని తెలిపారు. ఫతేషాపూర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను మే 15నాటికి పూర్తి చేయాలని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్, పామునూర్ లలో కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటుకు మరియు జఫర్ గడ్ లో 132/33కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.

నియోజకవర్గంలోని పలు గ్రామాలలో లైన్ షిఫ్టింగ్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. పలు గ్రామాలలో ఇళ్ల పై నుండి వెళ్తున్న 11కేవి విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ చేయాలని అన్నారు. కొత్తగా నిర్మాణం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు కొత్త లైన్స్ వేయాలని, దరఖాస్తు చేసుకున్న వారికీ వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జీరో బిల్ పథకం అమలు చేయాలని కోరారు. ఘనపూర్ నుంచి జఫర్ గడ్ మీదుగా వర్ధన్నపేట వరకు నాలుగు లైన్ల రహదారి మంజూరు అయిందని ఆ రహదారిలో ఉన్న పోల్స్ షిఫ్టింగ్ లేదా ఎక్స్ టెన్షన్ చేయాలని అన్నారు. లైన్ షిఫ్టింగ్ పనులకు సంబందించి ఎస్టిమేషన్స్ సిద్ధం చేస్తే ముఖ్యమంత్రి నుంచి మంజూరు తీసుకువస్తానని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన నియోజకవర్గమని తెలిపారు. దేవాదుల ద్వారా నియోజకవర్గంలోని రిజర్వాయర్లకు గోదావరి జలాలు వచ్చాయని దీంతో భూగర్భ జలాలు పెరగడం వల్ల వ్యవసాయానికి విద్యుత్ వినియోగం పెరిగిందని అన్నారు. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా అడిగిన వెంటనే విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి మంజూరు ఇచ్చిన సీఎండి వరుణ్ రెడ్డి కి నియోజకవర్గ రైతులు, ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ అధికారులకు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే మనందరి బాధ్యత అని తెలిపారు.

Next Story