Vijayashanti : పార్టీ మార్పుపై తేల్చేసిన విజయశాంతి

by Dishafeatures2 |
Vijayashanti : పార్టీ మార్పుపై తేల్చేసిన విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి పార్టీ మారనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తిరిగి కాంగ్రెస్ గూటికి ఆమె చేరనున్నారనే వార్తలొస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు రాములమ్మ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొనడం, నేతలందరూ పార్టీని వీడుతుండటంతో విజయశాంతి కూడా హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేననే ప్రచారం ఊపందుకోవడం, కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ వీక్ కావడంతో చాలామంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

ఈ క్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిన్న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా.. బీజేపీలో ఉన్న విజయశాంతి కూడా హస్తం గూటికి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నార. ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. ఇప్పటికే ఆమెతో కాంగ్రెస్ నేతలు చర్చలు కూడా జరిపారని, రేపో, మాపో పార్టీ మారడం ఖాయమనే టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై విజయశాంతి ట్విట్టర్‌లో స్పందించారు. సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదని, ఒక పార్టీకే పనిచేయగలుగుతానని అన్నారు. కాంగ్రెస్‌లో చేరి కేసీఆర్‌పై పోరాడాలని కొందరు సూచిస్తున్నారని, మరికొందరు బీజేపీలోనే ఉండాలని చెబుతారని తెలిపారు. సినిమా తీరుగా పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదని పేర్కొన్నారు.

Next Story