TRS నాకు రాసిపెట్టి ఉందేమో.. ఈసీ ఆమోదంపై కవిత ట్వీట్

by Prasad Jukanti |

కల్వకుంట్ల కవిత స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అస్తిత్వ పోరాటమే ధ్యేయమని కవిత వెల్లడించారు.

TRS నాకు రాసిపెట్టి ఉందేమో.. ఈసీ ఆమోదంపై కవిత ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును 'తెలగాణ రాష్ట్ర సేన' (TRS) గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈసీ మాత్రం 'తెలంగాణ రక్షణ సేన' పేరును కన్ఫర్మ్ చేసింది. దీంతో స్పందించిన కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. 'తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలియజేస్తున్నాను. జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యత గా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని TRS నాకు రాసిపెట్టి ఉందేమో!!' అంటూ ట్వీట్ చేశారు.

ఈసీకి అప్లై చేసిన ఐదు పేర్లు ఇవే:

తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లలో ఒక పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కవిత కోరారు. అయితే అప్లికేషన్ లో మూడో పేరుగా పెట్టిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. దీంతో విధి కల్వకుంట్ల కవిత వైపు నిలిచి టీఆర్ఎస్ పేరును ఆమెకు వచ్చేలా చేసిందని తెలంగాణ రక్షణ సేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story