పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ ఓ సవాల్: DGP అంజనీకుమార్

by Disha Web Desk 19 |
పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ ఓ సవాల్: DGP అంజనీకుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెరుగుతున్న అర్బనైజేషన్‌తో ప్రభుత్వానికి పలు సవాళ్ళు ఉంటాయని, అందులో ట్రాఫిక్ నియంత్రణ పెద్ద ఛాలెంజ్ అని డీజీపీ అంజనీకుమార్ వ్యాఖ్యానించారు. సమాజంలో భౌతికదాడులు, ఘర్షణలు, చోరీలు తదితరాలు వ్యక్తులకు సంబంధించినవైతే రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణ ప్రజలందరికీ సంబంధించినవని అన్నారు. రిటైర్డ్ అదనపు ఎస్పీ పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి రాసిన ట్రాఫిక్ యాక్సిడెంట్లు – ఇన్వెస్టిగేషన్ అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లో గురువారం ఆవిష్కరించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. పౌరులందరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్‌కు సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రాణనష్టాన్ని కూడా నివారించవచ్చని అన్నారు.

ప్రతీ వ్యక్తీ స్వయంగా ట్రాఫిక్ నియంత్రణకు పాల్పడినప్పుడే మెరుగైన ట్రాఫిక్ విధానాల అమలు సాధ్యమవుతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ మెరుగ్గానే ఉందన్నారు. కొన్ని నేరాలు వ్యక్తులకు సంబంధించినవిగా ఉంటాయని, కానీ ట్రాఫిక్ ప్రమాదాలు మాత్రం అందరికీ సమస్యలు సృష్టిస్తాయన్నారు. తిరుపతి రెడ్డి రాసిన పుస్తకం తెలంగాణ పోలీస్ అధికారులకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన్ను ప్రశంసించారు. నేషనల్ పోలీస్ అకాడమీ రిటైర్డ్ డైరెక్టర్ కమల్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఏటా నాలుగున్నర లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, వీరిలో దాదాపు లక్ష మంది మరణిస్తున్నారని గుర్తుచేశారు.

ప్రమాదాలకు గురైన వారు కేవలం బీమా ప్రీమియంను పొందేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రమాద దర్యాప్తు, కారకులైన వారికి శిక్ష పడే విషయంలో నిర్లక్ష్యం జరుగుతున్నదని అన్నారు. ట్రాఫిక్ ఆక్సిడెంట్ కేసుల విషయంలో సమర్ధవంతమైన దర్యాప్తు, తగిన శిక్ష పడినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. తిరుపతి రెడ్డి రాసిన పుస్తకం ట్రాఫిక్ ప్రమాదాల దర్యాప్తు అధికారులకు కరదీపికగా ఉపయోగపడుతుందని అన్నారు. చాలా శ్రమ తీసుకుని పుస్తకాన్ని తీసుకొచ్చిన రచయిత తిరుపతి రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్, కమల్ కుమార్, అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు.


Next Story

Most Viewed