మూడు పోస్టులకు ఒక్కడే.. పని భారంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్

by Malleboina Mahesh |

అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించే అధికారి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు బాధ్యతలు చేపడుతున్నారు.

మూడు పోస్టులకు ఒక్కడే.. పని భారంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించే అధికారి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పదవులు నిర్వహిస్తున్నారు. తాజాగా విత్తన ధ్రువీకరణ సంస్థ ఎండీగా నియామకమయ్యారు. ఒక అధికారి మూడు పోస్టులకు న్యాయం చేయడం ఏ విధంగా సాధ్యమవుతుందని అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో మంది అధికారులు ఉండగా ఆయనకే మరోసారి బాధ్యతలు ఇవ్వడం పలు విమర్శలకు తావిస్తోంది.

విత్తన ధ్రువీకరణ సంస్థ ఎండీ పోస్టులకు 10 మందికి పైగా ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అందరివీ రిజెక్ట్ చేసి వ్యవసాయ శాఖ డైరెక్టర్ కు కట్టబెట్టడంపై పెదవి విరుస్తున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు చేపట్టిన తర్వాత డిపార్ట్మెంట్‌కు సంబంధించిన అంశాలను వివరించడానికి సమయం లేదని తప్పించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అదనపు పని భారం తో మూడు పోస్టులలో ఏ శాఖకు పూర్తి సమయం కేటాయించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సచివాలయ సమీక్షలకే పరిమితం

రెండు శాఖల బాధ్యుడిగా ఉన్న సమయంలోనే సమీక్షల పేరుతో నిత్యం బిజీగా గడిపేవారని, ఇప్పుడు మూడు శాఖలకు బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పని మీద కార్యాలయానికి వస్తే సదరు అధికారి అందుబాటులో లేకుంటే కింది స్థాయి అధికారులు కూడా తామేమీ తక్కువ కాదని ముడుపులు వచ్చే పైలును మాత్రమే ముట్టకుంటున్నారనే టాక్ ఉంది. చివరికి పీఏలు, అటెండర్లను కలిసి సమస్య చెప్పుకోవడం తప్ప మరో మార్గం లేదని ప్రజలు వాపోతున్నారు.

ఉద్యోగ సంఘాల పేరుతో పైరవీలు

కొందరు అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులమని చలామణి అవుతూ జోరుగా పైరవీలకు తెర లేపారనే ప్రచారం జరుగుతోంది. కార్యాలయాలకు వచ్చే వారిని పరిచయం చేసుకుని ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాల అనుమతులు, రైతు రుణమా ణీ, రైతు భరోసా ఇప్పిస్తామని ఒప్పందాలు చేసు కుంటూ నాలుగు చేతులా సంపాదిస్తున్నట్లు విమ ర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలుంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేసే విధంగా రెచ్చగొట్టి తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని వారి వద్ద నుంచి ఖర్చుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.

సగం సిబ్బంది ముచ్చట్లతోనే కాలక్షేపం

వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ కార్యాలయాల్లో సగం మంది సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమయమంతా క్యాంటీన్లు, చెట్ల కిందే గడుపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు విత్తన ధ్రువీకరణ సంస్థలో కూడా అదే తంతు కొనసాగుతోంది. రైతును రాజు చేస్తామ నే పాలకులు వ్యవసాయ శాఖకు చురుకైన అధికారిని నియమించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Next Story