అందుకే ఫాతిమా కాలేజీని కూల్చట్లేదు.. ‘హైడ్రా’ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

నగర పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణే ధేయంగా నెలకొల్పబడిన ‘హైడ్రా’ (HYDRAA) అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

అందుకే ఫాతిమా కాలేజీని కూల్చట్లేదు.. ‘హైడ్రా’ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: నగర పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణే ధేయంగా నెలకొల్పబడిన ‘హైడ్రా’ (HYDRAA) అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను నిరుపేద, ధనిక అనే తేడాలు లేకుండా ముందుకు సాగుతోంది. అయితే, ప్రాసెస్‌లో భాగంగా సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీని కూడా కూల్చివేసేందుకు హైడ్రా పూనుకుంది. కానీ, బిల్డింగ్ కూల్చివేతపై అధికారులు వెనక్కి తగ్గారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు పేదోళ్లకు ఓ న్యాయం.. ఒవైసీ బ్రదర్స్‌ ఓ న్యాయమా అని స్టేట్‌మెంట్లు ఇస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫాతిమా కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లోనే తొలగించాలని అనుకున్నామని అన్నారు.

పేద ముస్లిం విద్యార్థినుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోందని అన్నారు. కళాశాలలో ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజులు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఫాతిమా కాలేజీలో సుమారు 10 వేల మందికి‌పైగా విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. నిరుపేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని అన్నారు. ఇలాంటి కళాశాలలు సామాజికంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తున్నాయని, ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుంచి విముక్తి చేస్తాయని అన్నారు. కానీ, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని ‘హైడ్రా’ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

Next Story