TG Govt: లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఆ సర్వే తరువాతే కొత్త రేషన్ కార్డులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-31 04:25:50  IST  )

రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది.

TG Govt: లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఆ సర్వే తరువాతే కొత్త రేషన్ కార్డులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. గతంలో చేసిన దరఖాస్తుదారుల వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సర్వే నెలాఖరులోగా పూర్తి కావచ్చని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. మే నెలలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికి గ్రామ సభలో ఎన్నికైన 1.20 లక్షల కార్డులకు మాత్రమే ఏప్రిల్​నెలలో రేషన్​సరుకుల పంపిణీ జరగనుంది. మిగతా వారికి సర్వే పూర్తి చేసే తరువాతే పంపిణీ చేస్తారు. ప్రజలు నాలుగు దఫాలుగా రేషన్​కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా 13 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో నిబంధనల మేరకు ఉన్నవాటిని అధికారులు ఎంపిక చేయనున్నారు. సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశం ఉందంటున్నారు. కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు చేరుతారని ఇటీవలే మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి చెప్పారు.

ఈ నెలాఖరులోగా ఇంటింటి సర్వే పూర్తి

కొత్త రేషన్​కార్డుల కోసం ప్రజలు నాలుగు దఫాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలన, గ్రామసభలు, ప్రజావాణి, మీసేవ, కులగణనలో అప్లై చేసుకున్నారు. కులగణనతోపాటు రేషన్​కార్డుల లబ్ధిదారులను కూడా గుర్తించారు. మిగతా ధరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని, కార్డుల్లో పేర్లు రాలేదని మొరపెట్టుకుంటున్నారు. దీంతో నిజమైన అర్హులను గుర్తించాలని ప్రభుత్వం ప్రత్యేక యాప్ ద్వారా సర్వేను చేపట్టింది. ఇప్పటికే దరఖాస్తుల డేటాను పౌరసరఫరాల శాఖ ఆన్‌లైన్‌లో​అప్‌లోడ్ చేసింది. సర్వేలో భాగంగా యాప్ ద్వారా 360 డిగ్రీలో వివరాలు సేకరించనున్నారు. ఆదాయ స్థితిగతులు, గతంలో కార్డు ఉందా, ప్రత్యేక కార్డు కావాలా, తదితర వివరాలను యాప్ లో నమోదు చేస్తారు. అనర్హులైతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. అర్హులైతే వివరాలు రికార్డు అవుతాయి. సర్వే నివేదికను కలెక్టర్లకు అందజేస్తారు. అక్కడి నుంచి పౌరసరఫరాల శాఖ కమిషనర్ కు వెళ్తాయి. అక్కడ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన వారిందరికీ కార్డుల మంజూరు పూర్తి అయిన తరువాతే ఫిజికల్​కార్డుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Next Story