బీజేపీ అధ్యక్షుడి సెల్ ఫోన్ చుట్టూ టెన్త్ లీక్ కేసు.. ఫొన్ మీదే పోలీసుల ఫోకస్!

by Dishanational2 |
బీజేపీ అధ్యక్షుడి సెల్ ఫోన్ చుట్టూ టెన్త్ లీక్ కేసు.. ఫొన్ మీదే పోలీసుల ఫోకస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెన్త్ హిందీ పేపర్ లీక్ వ్యవహారం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అయితే బండి సంజయ్ ఫోన్ దొరికితే కేసు విచారణలో అనేక సంచలనాలు వెలుగు చూస్తాయని స్వయంగా సీపీ రంగనాథే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బండి సంజయ్ కు, ప్రశాంత్ కు మధ్య తరచూ వాట్సాప్ చాట్స్, కాల్స్ సంభాషణలు జరిగాయని, నిర్దోషి అయితే బండి సంజయ్ తన ఫోన్ ను దాచాల్సిన అవసరం ఏముందని సీపీ ప్రశ్నించారు. దీంతో ఈ కేసు ఇప్పుడు బండి సంజయ్ సెల్ ఫోన్ చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం షురూ అయింది. అరెస్ట్ రోజు బండి సంజయ్ చేతిలో ఫోన్ ఉందని పోలీసులు అడిగే సరికే మాయం చేశారని బీఆర్ఎస్ నేతలు వాదిస్తుంటే సెల్ ఫోన్ అంశం అంతా పోలీసుల డ్రామా అని బీజేపీ అనుకూల నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కేసులో వివరాలు సేకరించేందుకు బండి సంజయ్ ఫోనే కావాలా? ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రశాంత్ ఫోన్ డేటా రీట్రైవ్ చేస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి కదా అనే ప్రశ్నలు బీజేపీ అనుకూల వర్గం సంధిస్తోంది. ఇదిలా ఉంటే బండి సంజయ్ ఫోన్ టెన్త్ ప్రశ్నపత్రాల కేసు కోసం కాదని ఆయన ఫోన్ లో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని వాటిని తారుమారు చేసేందుకే ఆయన ఫోన్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని మరికొంత మంది నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు. టీఎస్ పీఎస్సీ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని వాటికి సంబంధించిన ఆధారాలు బండి సంజయ్ ఫోన్ లో ఉండి ఉంటే వాటికోసమే ఈ ప్రయత్నమంతా అనే ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో అసలు బండి సంజయ్ ఫోన్ లో ఏముందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే బండి సంజయ్ ఫోన్ లభించకపోయినా ఇతర మార్గాల ద్వారా తాము సమాచారం సేకరిస్తామని ఇప్పటికే సీపీ చెప్పడంతో ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయనేది ఆసక్తిని రేపుతోంది.

Next Story