ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు.. న‌వ‌శ‌కానికి తెలంగాణ శ్రీకారం

by Gantepaka Srikanth |

ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు.. న‌వ‌శ‌కానికి తెలంగాణ శ్రీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇల్లు, భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్క ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. సుమారు 4 లక్షల ఇళ్లను మంజూరు చేసి గృహ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ న‌గర్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించాలని, జిల్లా స్థాయిలో అధికార యంత్రాగమంతా సమన్వయంతో పని చేస్తే అక్కడికక్కడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అత్యధిక శాతం అధికారాలను కలెక్టర్లకే ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ఇచ్చి, మొదటి బిల్లు వారి ఖాతాల్లో జమ అయిన లబ్ధిదారులందరికీ తదుపరి విడతల బిల్లులన్నిటిని సకాలంలోనే విడుదలయ్యేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా, పూర్తి పారదర్శకంగా జవాబుదారీ తనంతో పనిచేస్తూ అర్హులైన వారికే ఫలాలు దక్కేలా చూడాలని ఈ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. ఇల్లు మంజురైనా వివిధ కారాణలతో నిర్మాణాలను పూర్తి చేయని వారికి కూడా వెసులుబాటు కల్పించే యోచనలో ఉన్నామన్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణపు పనులు ఏ స్థాయిలో ఉన్నా, 20 వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని ఆదేశించారు.

లక్ష కంటే ఎక్కువైతే మరో తహశీల్దార్..

అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో, అవసరానికి అనుగుణంగా, అదనంగా మరో తహశీల్దార్ ను నియమించనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. రెవెన్యూ, అటవీ తదితర శాఖల మధ్య ఉన్న భూ వివాదాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఉమ్మడిగా సర్వే చేయడమే మార్గమన్నారు. ఈ దిశలో మరింత వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అటవీ, రెవెన్యూ అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా రెవెన్యూ విభాగంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఆర్డీవోలకు విస్తృతమైన అధికారాలు కల్పించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా, ఇతర ప్రయోజనాలకు వీటిని వినియోగిస్తే అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

భూ రికార్డుల్లో పారదర్శకత..

రాష్ట్రంలో భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్మెంట్స్ మరియు భూ రికార్డుల శాఖ ద్వారా సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. భూ రికార్డుల్లో పారదర్శకత, ఖచ్చితత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ ఇన్ ఛార్జి మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story