లండన్‍లో ఘనంగా తెలంగాణ డే వేడుకలు

by Prasad Jukanti |

లండన్ భారత హైకమిషన్‌లో తెలంగాణ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా హైదరాబాద్ బిర్యానీకి అతిథులు ఫిదా అయ్యారు.

లండన్‍లో ఘనంగా తెలంగాణ డే వేడుకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లండన్‍లో ‘తెలంగాణ డే’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్‍లోని భారత హైకమిషన్ కార్యాలయంలో నిర్వహింహించిన ఈ వేడుకల్లో యూకేలోని వివిధ ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (TAUK) సంస్థ తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. అలాగే తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన, అతిథులకు టాక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బిర్యానీని రుచి చూపించారు. ఈ సందర్భంగా లండన్‍లోని భారత హైకమీషనర్ పెరియసామి కుమారన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, ప్రవాసులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాసుల్లో ఐక్యత, విదేశీ గడ్డపై భారత సంస్కృతిని ప్రచారం చేయ్యడానికి వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకల్ని భారత హైకమిషన్ అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. టాక్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. టాక్ సంస్థ సభ్యులు కుమారి తన్మయి వర్షిణి కుప్పాల, నిధి గుడ్ల, ఏషిక.డి చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నిరసనల చోటే అధికారిక కార్యక్రమం:

టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ లండన్‍లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న "తెలంగాణ డే" వేడుకల్లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాడు టాక్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు అనిల్ కూర్మాచలం నాయకత్వంలో ఇదే భారత హైకమిషన్ ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ కేసీఆర్ పిలుపు మేరకు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు అదే భారత హై కమిషన్ కార్యాలయంలో అధికారికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు.

తెలంగాణ రుచులకు ఫిదా:

ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసిన భారత హైకమిషన్ కార్యాలయానికి, అధికారులకు, హాజరై సహకరించిన సభ్యులకు టాక్ ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు కృతఙతలు తెలిపారు. టాక్ సంస్థ కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్పర్సన్ గణేష్ కుప్పలా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను వివరిస్తూ, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని, టాక్ సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. వేడుకల ముగింపులో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే ఆధ్వర్యంలో అతిథులకు సంప్రదాయ తెలంగాణ వంటకాలతో ఆతిథ్యం అందించారు. తెలంగాణ రుచులను ఆస్వాదించిన అతిథులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాషను విదేశాల్లోని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని మరింతగా చాటిచెప్పే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం TAUKకు ఎల్లప్పుడూ గర్వకారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన తెలంగాణ వాస్తవ్యులు లార్డ్ ఉదయ్ నాగరాజు, టాక్ సంస్థ ప్రతినిధులు రత్నాకర్ కడుదుల, గణేష్ కుప్పలా, నవీన్ రెడ్డి, సురేష్ బుడగం, సుప్రజ పులుసు, స్వాతి, అబ్దుల్ ఖుద్దూస్, నవ్య కుప్పాల, కుమారి తన్మయ తదితరులు పాల్గొన్నారు.

Next Story