ఐదేళ్ళు అధికారం ఇచ్చుంటే.. తెలంగాణనే మాయం! ఎందుకో తెలుసా? కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 14 |
ఐదేళ్ళు అధికారం ఇచ్చుంటే.. తెలంగాణనే మాయం! ఎందుకో తెలుసా? కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంకా ఐదేళ్ళు అధికారం ఇచ్చుంటే.. తెలంగాణనే మాయం చేసేటోళ్ళు.. అని తెలంగాణ కాంగ్రెస్ విమర్శించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తులో అనేక అసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించింది. పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న మెజర్‌మెంట్‌ బుక్‌(ఎం.బుక్‌) అసలు లేనే లేదని దర్యాప్తులో తేలిందని వివరించింది.

తుది బిల్లుకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థ కోరగా, పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న వివరాలు లేవని, పొరపాటున ఒక ఎం.బుక్‌ నంబరు బదులు మరో ఎం.బుక్‌ నంబరు వేశామని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తిరుపతిరావు విజిలెన్స్‌ ఎస్పీకి లేఖరాశారు. పని పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తర్వాత కూడా పలు పనులు పెండింగ్‌లో ఉన్నట్లు నిర్మాణ సంస్థకు ఇంజినీర్లు లేఖలు రాసిన అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలిసిందని పేర్కొంది.

పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో ఏయే పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయో ఎందుకు నమోదు చేయలేదని కూడా ప్రశ్నిస్తూ దర్యాప్తు సంస్థ అధికారులు వివరణ కోరినట్లు తెలిసినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని పేర్కొంది.

Next Story