తెలంగాణ బడ్జెట్ హైలెట్స్

by Disha Web Desk 4 |
తెలంగాణ బడ్జెట్ హైలెట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలనీ, ఇందుకోసం డైట్‌ ఛార్జీలను రెట్టింపు (డ‌బుల్‌) చేయాలని ప్రభుత్వం బడ్జెట్​లో వెల్లడించింది. టీ.బి.,క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్‌ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను రూ. 56 నుంచి రూ. 112 పెంచాలనీ, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి రూ. 40 నుంచి రూ. 80 పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 43.5 కోట్లు ఖర్చు చేయనుంది. హైదరాబాద్‌ లోని 18 మేజర్‌ ప్రభుత్వ హాస్పటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించనున్నారు. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతీ రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని, దీని కోసం సంవత్సరానికి రూ. 38.66 కోట్లు ఖర్చవుతాయని వెల్లడించారు. ఇక పారిశుధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును రూ. 5 వేల నుంచి రూ. 7500కు పెంచాలని, దీనికోసం కోసం ప్రభుత్వం రూ. 338 కోట్లను వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు రూ. 32. 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్​రావు వెల్లడించారు.

కొత్త పింఛన్లు

వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గించిందని, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్‌లో రూ. 11728 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలోని గొర్రె కుర్మలకు రూ. 11 వేల కోట్ల వ్యయంతో 7.3లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఈ బడ్జెట్‌లో గొర్రెల పంపిణీ కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డబుల్​ బెడ్​ రూం ఇండ్లను ఈ ఏడాది నిర్మిస్తామని బడ్జెట్​ ప్రసంగంలో మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. దీనికోసం బడ్జెట్​లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో డబుల్​ బెడ్​ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకమని, స్థానిక ఎమ్మెల్యేల వాటా మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు.

పేద వర్గాలు కార్పొరేట్​ వైద్యాన్ని అందుకునే ఆరోగ్య శ్రీకి పరిమితిని పెంచారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షల వరకు ఉచిత వైద్యం ఉండగా.. ఇక నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ బడ్జుట్​లో ప్రకటించారు. అదే విధంగా అవయమార్పిడి కోసం రూ. 5 లక్షలు పెంచగా, కొత్తగా ఆక్సిజన్​ ప్లాంట్లలో 135 టన్నుల నుంచి 550 టన్నులకు పెంచేందుకు నిధులు కేటాయించారు. వరంగల్​ను హెల్త్​ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దీనిలో భాగంగా ఈఏడాది కొత్తగా 8 జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రూ.1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఈ ఏడాది ఆసిఫాబాద్, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, జనగాం, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మిగతా 8 జిల్లాలైన యాదాద్రి, ములుగు, వరంగల్, మెదక్, మేడ్చర్, రంగారెడ్డి, నారాయాణపేట, గద్వాల్ జిల్లాల్లో మెడికల్​ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. హెచ్​ఎండీఏ పరిధిలో 94 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు.

Next Story