పేదలు, మహిళలను వెంటనే విడుదల చేయాలి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

by Dishafeatures2 |
పేదలు, మహిళలను వెంటనే విడుదల చేయాలి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హయత్‌నగర్‌ మండలం సాయబ్‌నగర్‌లో ప్రభుత్వ భూమిలో ఇంటిస్థలం కోసం పోరాడుతున్న పేదలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడంతో పాటు అరెస్టు చేసి అర్థరాత్రి జైలుకు పంపించారని, వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సాయబ్‌నగర్‌లో ఉన్న 26 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇండ్లస్థలాలు ఇప్పించాలని కోరుతూ తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది పేదలు ఉద్యమించారని తెలిపారు. జానెడు స్థలం కోసం పోరాడుతున్న పేదలపై స్థానిక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జీ చేసి అరెస్టు చేశారని, వీరిపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి జడ్జిముందు ప్రవేశపెట్టి జైలుకు పంపారన్నారు. వీరిలో 9 మంది మహిళలతో కలిపి మొత్తం 19 మంది ఉన్నారని వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ ప్రాంతంలోని దళితవాడ మీద కూడా దాడి చేసి స్థానికులతో పాటు మహిళలను తీవ్రంగా గాయపర్చారని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు స్థలం కేటాయించి, గృహ నిర్మాణం కోసం రు.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూపోరాటంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, దళితులు, మహిళల మీద దాడి చేసిన సీఐని సస్పెండ్‌ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రజాసంఘాల పోరాటవేదిక ఆధ్వర్యంలో పేదలందరికీ ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో మహబూబాబాద్‌లో ప్రారంభమైన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకుని ఆపాలని చూశారని, దీనిని సీపీఎం ఖండిస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంగా సాగుతున్న యాత్రను అడ్డుకోవాలని చూస్తే ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వృత్తి కులాలకు ఆర్థిక సహాయ పథకం దరఖాస్తు గడువు పెంచాలని తమ్మినేని మంత్రి గంగుల కమలాకర్‌‌కు లేఖ రాశారు.

===

Next Story