అందరూ స‌హ‌క‌రించండి: స్పీక‌ర్ ప్రసాద్ కుమార్ రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-10 16:25:24  IST  )

ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని స్పీక‌ర్ ప్రసాద్ కుమార్ రిక్వెస్ట్ చేశారు..

అందరూ స‌హ‌క‌రించండి: స్పీక‌ర్  ప్రసాద్ కుమార్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వజరీ నూతన కమిటీ మొదటి సమావేశం బుధ‌వారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ ఛైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస రెడ్డి , కో చైర్మన్ పరిపూర్ణా చారి, సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన శాసనసభ, మండలి గౌరవం, ప్రాధాన్యతలను కాపాడుతూ మీడియా సలహా మండలి ద్వారా మీ వంతుగా సేవలను అందించడం మంచి అవకాశం అని చెప్పారు. సీనియర్ జర్నలిస్టులుగా మీరు ఎంతో అనుభవం ఉన్నవారని, ఉభయ సభలు సజావుగా జరగడానికి తమ వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందించాలని కోరారు. మనందరం కలిసి శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగి, అర్ధవంతమైన చర్చల కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని అందరి ఉద్యేశం అని వ్యాఖ్యానించారు. శాసనసభ సమావేశాల సమయంలోనే కాదు, ఇతర సమయాలలో కూడా శాసనసభకు సంబంధించిన వార్తలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని మీడియాకు విజ్జ్ఞప్తి చేశారు.

అనంతరం శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ, శాసన మండలి సమావేశాలు సజావుగా నడవాలి అంటే మీడియా పాత్రనే కీలకమ‌ని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభను హుందాగా నడవడానికి అన్ని విధాలుగా సహకారం అందించాలని, రానున్న రోజుల్లో శాసన సభ, శాసన మండలి ఒకే భవనంలోకి రాబోతున్నాయని అన్నారు. దీంతో కొన్ని చేర్పులు మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీడియా కమిటీ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

శాస‌నస‌భా వ్యవ‌హారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ... శాసనసభ, శాసన మండలి వ్యవహారాలలో మీడియాకు బాధ్యతను కల్పించడానికి, మరింత పాత్రను పోషించడానికే మీడియా అడ్వైజరీ కమిటీని నియ‌మించిన‌ట్లు తెలిపారు. ఉభయ సభల నిర్వాహణలో అందరి సహకారాన్ని కోరారు. సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు, వసతులపై ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమావేశాల సందర్భంగా జారీ చేసే పాస్ ల విషయంలో క‌మిటీ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, మంచి వాతావరణంలో సమావేశాలు జరిగే విధంగా అందరం కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

కమిటీ ఛైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... సమావేశాల సందర్భంగా కవరేజ్ చేసే మీడియా ప్రతినిధులందరికి పాస్ లు అందే విధంగా సూచనలను అందిస్తామ‌ని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులకు అవసరమయ్యే సౌకర్యాలపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సూచనలను చేస్తామ‌ని తెలిపారు. ఈ సమావేశంలో లేజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు, కమిటీ కో ఛైర్మన్ పరిపూర్ణా చారి, సభ్యులు పాల్గొన్నారు.

Next Story