కాంగ్రెస్‌లో సీనియర్ల తిరుగుబాటు.. ఢిల్లీలో తేల్చుకుందామని నిర్ణయం!

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లో సీనియర్ల తిరుగుబాటు.. ఢిల్లీలో తేల్చుకుందామని నిర్ణయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా 1977–78 పరిస్థితులు కండ్ల ముందు కనిపించాయి. రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ చరిత్ర రాష్ట్రంలో పునరావృతమైన సందర్భంగా నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ వేరుగా చీలిపోయింది. టీడీపీ కాంగ్రెస్‌గా రేవంత్ వర్గాన్ని వేలెత్తి చూపుతున్నారు. హస్తం పార్టీలోని సీనియర్లంతా టీపీసీసీ చీఫ్‌కు.. కమిటీలకు వ్యతిరేకంగా ఐక్యతారాగం అందుకున్నారు. సేవ్​కాంగ్రెస్​పేరుతో సీనియర్లు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇదే నినాదంతో హస్తినకు పయనమవుతున్నారు. నిన్నటి వరకు ఒకరిద్దరు నేతలకు పరిమితమైన అసంతృప్తి.. ఇప్పుడు పార్టీ మొత్తానికి పాకింది. ఉద్దేశపూర్వకంగానే సీనియర్లపై కోవర్టు ముద్ర వేస్తున్నారంటూ సీనియర్లు ఆరోపణలకు దిగుతున్నారు. రాష్ట్రంలో అసలు కాంగ్రెస్​మాదేనంటూ ఏఐసీసీ ముందు పంచాయతీకి సిద్ధమయ్యారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలు చేద్దామంటూ కొంతమంది నేతలు ప్రతిపాదించారు. మొత్తంగా కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్పీడ్ అందుకుంది. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ నేతలంతా తిరుగుబాటును ప్రకటించారు. సేవ్​కాంగ్రెస్​నినాదాన్ని ఎత్తుకున్న సీనియర్లు.. ఈ నెల 24న మళ్లీ సమావేశమై.. సేవ్ కాంగ్రెస్​ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు.

వారం నుంచి వ్యూహాలు

టీపీసీసీ కమిటీలు ప్రకటించినప్పటి నుంచీ కాంగ్రెస్‌లో అసంతృప్తులు చెలరేగిపోతున్నాయి. దీంతో సీనియర్ల దగ్గర ఒత్తిడి పెరిగింది. టీపీసీసీ కమిటీలు వేస్తారనే ప్రచారం నేపథ్యంలో పలువురు సీనియర్లు ఢిల్లీకి వెళ్లి తమ వారి కోసం ప్రయత్నాలు కూడా చేసి వచ్చారు. కానీ, కమిటీల్లో రేవంత్​మార్క్​స్పష్టమైంది. ఆయన వర్గీయులతో మొత్తం కమిటీ నిండిపోయింది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి రేవంత్‌తో పాటుగా చేరిన వారితో సహా.. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన వారు, పార్టీలో కొన్నిరోజులుగా సైలెంట్​ ఉంటున్న వారితో పాటుగా ఇటీవల పలు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేతలుగా ఎదుగుతున్న వారికి పదవులు వచ్చాయి. దీంతో దాదాపుగా ఏడెనిమిదేండ్ల నుంచి హస్తం పార్టీని పట్టుకుని పని చేస్తున్న వర్గాల్లో అసంతృప్తి బద్దలైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ల దగ్గరకు పరుగులు పెట్టారు. దీన్ని సమర్థించేందుకు సీనియర్లు కూడా ఆసక్తి చూపించలేదు. అయితే, ఒక్కొక్కరిగా సమావేశమవుతున్న నేతలు.. శనివారం ఒకేసారి ఒక్కటయ్యారు. అంతకు ముందు ఇప్పటికే సీఎల్పీ నివాసంలో మధుయాష్కీ, కోదండరెడ్డి, వీహెచ్​ తొలి విడుతగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. శనివారం ఏకంగా సీనియర్లంతా కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంతో తిరుగుబాటుపై స్పష్టత వచ్చింది. అటు నేతలు కూడా రేవంత్‌కు వ్యతిరేకంగా సేవ్​కాంగ్రెస్ నినాదాన్ని ఎత్తుకున్న ప్రకటించారు.

సీనియర్లు ఇటు.. రేవంత్​అటు

రాష్ట్రంలో సీనియర్లు వర్సెస్​రేవంత్​ వర్గంగా వీడిపోయారు. కొంతకాలం కిందట వరకు వివాదాలకు అంటీముట్టనట్టుగా ఉన్న నేతలు కూడా తాజా పరిణామాల్లో సీనియర్ల టీంలో చేరిపోయారు. దీంతో రేవంత్​బృందంలో ఆయనతో పాటుగా కాంగ్రెస్‌లో చేరిన కొంతమంది నేతలు, కాంగ్రెస్​ పక్షాన మల్లు రవి వంటి నేతలు మినహా.. సీనియర్లు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఇదే సమయంలో జిల్లాల నుంచి కూడా వ్యతిరేకవర్గీయులు సీనియర్ల తరపున నిలబడుతున్నారు. దీంతో ఇప్పుడు అసలు కాంగ్రెస్​పార్టీ ఏదనే అనుమానాలు మొదలయ్యేలా మారింది.

తేల్చుకుందాం.. పదండి

అసంతృప్తి అగ్నిజ్వాలగా మారింది. ఒక్కొక్కరుగా ఆవేదనతో ఉన్న నేతల్లో ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైంది. ఫలితంగా శనివారం సీఎల్పీ భట్టి నివాసంలో కీలక భేటికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు చాలా సీరియస్‌గా ఆరోపణలకు దిగుతున్నారు. అయితే, ఏఐసీసీ దగ్గరకు వెళ్లి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామంటూ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి సీరియస్ అయ్యారు. టీపీసీసీ కమిటీల్లో జరిగిన లోపాలపై చెప్తున్నా రిప్లై రావడం లేదని, అటు ఏఐసీసీ కూడా ఏం చేయడం లేదంటూ సమావేశంలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దామోదర రాజనర్సింహాతో సహా పలువురు వారించినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ మనదేనని, ఏఐసీసీ ముందు పంచాయతీకి పెడుతామంటూ నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

వేరు కుంపటి

మొత్తంగా పార్టీలోని సీనియర్లంతా తొలిసారిగా ఏకమయ్యారు. తమ ప్రథమ లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని స్పష్టత ఇచ్చారు. గతంలో పార్టీ అంతర్గత విషయాలపై ఒకరిద్దరు మాత్రమే స్పందించారు. టీపీసీసీ చీఫ్ ప్రకటించినప్పటి నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకంగా ఉండగా, జగ్గారెడ్డి అడపాదడపా విమర్శలకు దిగుతున్నారు. గతంలో మధుయాష్కీ కూడా వ్యతిరేక స్వరం వినిపించినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. కానీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వంటి నేతలంతా సైలెంట్‌గా ఉంటున్నారు. బహిరంగ విమర్శలు చేయలేదు. కానీ, తాజాగా అనూహ్యంగా తిరుగుబాటును ప్రకటించారు. మొన్నటి వరకు కమిటీల ఏర్పాటుపై నోరు విప్పని నేతలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరు ప్రస్తావించకుండానే రేవంత్ రెడ్డిని చెండాడుతున్నారు. వలస నేత అంటూ దూకుడు పెంచారు.

ఠాగూర్ పైనా అసంతృప్తి

రేవంత్ రెడ్డిపైనా ముందు నుంచీ అసంతృప్తితో ఉన్న నేతలు తాజాగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్‌ను కూడా టార్గెట్ చేశారు. అసలు ఢిల్లీకి తప్పుడు సమాచారాలు అందిస్తున్నారంటూ ఈ సందర్భంగా నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. గతంలోనూ ఠాగూర్​పైనా ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి : కాంగ్రెస్ నేతల్లో వ్యూహకర్త చిచ్చు.. అసలు ఎస్‌కే ఆఫీస్‌లో దొరికిందేంటి?

Next Story

Most Viewed