ఎప్పుడు చంపుతారోననే భయంతో బతుకుతున్నా: సూసైడ్ నోట్‌లో శేజల్ సంచలన విషయాలు

by Disha Web Desk 19 |
ఎప్పుడు చంపుతారోననే భయంతో బతుకుతున్నా: సూసైడ్ నోట్‌లో శేజల్ సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు, ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇప్పటికే రెండు సార్లు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన శేజల్ ఇవాళ మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద శేజల్ స్పృహ తప్పి పడిపోయింది. నిద్రమాత్రలు తీసుకుని శేజల్ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె బ్యాగులో నిద్రమాత్రలతో పాటు సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ నోట్‌లో శేజల్ పలు సంచలన విషయాలను ప్రస్తావించింది.

తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎమ్మె్ల్యే దుర్గం చిన్నయ్య వ్యతిరేకంగా ఆరు నెలల నుండి పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో ఆరోపించింది. ఇక, ఎమ్మెల్యే చిన్నయ్య నుండి రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని.. ప్రభుత్వం ఎమ్మెల్యే చిన్నయ్యకే వత్తాసు పలుకుతోందని శేజల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఓ బీఆర్ఎస్ ఎంపీకి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు చిన్నయ్య వేధింపులపై ఆధారాలు లేవంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని శేజల్ లేఖలో వాపోయింది. ఎప్పుడు చంపుతారోననే భయంతో బతుకుతున్నానని.. పెద్దమ్మ గుడి వద్ద అయితే ప్రశాంతంగా ఉంటుందని శేజల్ పేర్కొంది. ఇకనైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శేజల్ మరోసారి కోరింది. ఇక, పెద్దమ్మ టెంపుల్ వద్ద అపస్మారక స్థితిలో పడిపోయిన శేజల్‌ను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో శేజల్‌ను ఆసుపత్రికి తరలించారు.

Next Story