సీఎం కేసీఆర్‌కు షాక్.. నిధులు దొంగిలించిందని సర్కార్‌పై కేసులు వేస్తున్న సర్పంచ్‌లు

by Disha Web Desk |
సీఎం కేసీఆర్‌కు షాక్.. నిధులు దొంగిలించిందని సర్కార్‌పై కేసులు వేస్తున్న సర్పంచ్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసుకోవడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. సర్పంచ్‌లకు సమాచారం లేకుండా 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది. వాటిని పంచాయతీలు వాడుకునేందుకు వీలు లేకుండా విద్యుత్​ బిల్లులు, అడ్బాన్సులు చెల్లించేందుకు ప్రభుత్వ ఖాతాకు మళ్లించింది. ఇప్పటికే ట్రాక్టర్​ఈఎంఐలు, డీజిల్​ఖర్చులకు చిల్లిగవ్వ లేదని, ఈఎంఐలు చెల్లించకపోవడంతో ట్రాక్టర్లను వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు ఇచ్చారని సర్పంచ్‌లు మొర పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం డైవర్ట్​చేసింది. దీంతో సర్పంచ్‌‌లు తమ ఖాతాల్లోని నగదును దొంగతనం చేశారంటూ ప్రభుత్వంపై కేసు పెడుతున్నారు. తమ డిజిటల్​కీలను సర్పంచ్‌గా తమకు తెలియకుండా మండల పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి తీసుకున్నారని, తమ సంతకాలను ఫోర్టరీ చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చెల్పూరు గ్రామ పంచాయతీ నిధులను అధికారులు డైవర్ట్ చేశారని సర్పంచ్ మహేందర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయతీ అకౌంట్లోని డబ్బులను డ్రా చేశారని, తన సంతకానికి డిజటల్ కీ ఇప్పించడంతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని మహేందర్ డిమాండ్ చేశాడు. అయితే, ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోవటంతో రిజిస్టర్ పోస్టులో కంప్లైట్‌ను పంపించారు.

అన్ని పంచాయతీ ఖాతాలు ఖాళీ

రాష్ట్రంలోని పంచాయతీ ఖాతాలన్నీ ప్రభుత్వం ఖాళీ చేసింది. కేవలం గంటల వ్యవధిలోనే నిధులను మళ్లించింది. దీంతో గ్రామాల సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో కేసులు నమోదు చేయాలని తీర్మానాలు చేశారు. కొన్నిచోట్ల పోలీసులు ఈ ఫిర్యాదులు తీసుకోకపోవడంతో.. హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో కోర్టులో పిటిషన్లు వేయనున్నట్లు చెప్తున్నారు.

Next Story

Most Viewed