ఫోన్ ట్యాపింగ్‍తో మరో సంచలనం.. సంతోశ్ రావు విచారణలో కవిత పేరు ప్రస్తావన!

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో తవ్విన కొద్ది సంచలనాలు వెలుగు చూస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్‍తో మరో సంచలనం.. సంతోశ్ రావు విచారణలో కవిత పేరు ప్రస్తావన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తవ్విన కొద్ధి సంచలనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావుతో పాటు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ను సిట్ (SIT) అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్ మెంట్లు రికార్డు చేసి దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జోగినపల్లి సంతోశ్ రావు (Joginipally Santosh Rao) విచారణలో కొత్త కోణం వెలుగు చూసిందని ఫోన్ ట్యాపింగ్ సమచారంతో ల్యాండ్ సెటిల్ మెంట్ల వ్యవహారాన్ని సిట్ గుర్తించిందని ఓ ఆంగ్ల వెబ్ సైట్ కథనం వెలువరించింది. అక్రమ నిఘా (illegal surveillance) ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి ధరణి పోర్టల్ ద్వారా కోట్లాది రూపాయల భూ కుంభకోణాలకు, రంగారెడ్డి జిల్లాలో అత్యంత విలువైన భూ సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నివేదికలు వెల్లడించాయని ఈ కథనం పేర్కొంది.

కవిత పేరు ప్రస్తావన:

కేసీఆర్ కు వెన్నంటి ఉండే మాజీ ఎంపీ సంతోశ్ రావును గత నెల 26వ తేదీన సిట్ ప్రశ్నించింది. అయితే సంతోష్ కుమార్‌ను విచారిస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ప్రమేయం ఉన్న ఓ భూ లావాదేవీ (Land Deal) గురించిన సమాచారం బయటపడిందని సిట్ (SIT) వర్గాలు తెలిపినట్లు ఈ వెబ్ సైట్ పేర్కొంది. భూ వివాదాల్లో ఉన్న వ్యక్తుల గురించిన రహస్య సమాచారాన్ని (intelligence) సేకరించి, తద్వారా వారిని బలవంతంగా సెటిల్మెంట్లకు ఒప్పించాలని ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబి (SIB) చీఫ్ టి.ప్రభాకర్ రావుకు ఆదేశాలు అందినట్లు వర్గాలు తెలిపాయని అలాగే, ఈ కార్యకలాపాల వల్ల డిజిటల్ ఆధారాలు (digital footprints) మిగిలిపోతున్నాయని నాటి బీఆర్ఎస్ నాయకురాలు కె.కవిత (Kavitha) గతంలోనే నల్గొండకు చెందిన ఒక మాజీ మంత్రిని హెచ్చరించినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయని ఈ కథనం పేర్కొంది.

రాత్రికి రాత్రే మాయం:

రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నిర్దిష్ట సర్వే నంబర్ల వివరాలను సిట్ (SIT) సేకరించిందని ఆ సర్వే నంబర్లకు సంబంధించిన భూ హక్కులను (land titles) ధరణి పోర్టల్‌లో రాత్రికి రాత్రే మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తన స్వంత విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఈ సమాచారాన్ని సేకరించిందని అక్రమాల పరిమాణం విపరీతంగా ఉందని సిట్ కు చెందిన ఓ అధికారి తమకు తెలిపినట్లు సదరు వెబ్ సైట్ పేర్కొంది. కొన్ని భూ ఒప్పందాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై రంగారెడ్డి మాజీ కలెక్టర్ ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నారని ఈ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో కూడా విచారణలో ఉన్నాయని ఈ కథనం పేర్కొంది.

ఏం జరగబోతోంది?:

ఈ కేసులో ఇప్పటికే కేసీఆర్ ను సైతం సిట్ విచారణ జరపడంతో సిట్ తదుపరి ఏం చేయబోతోందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఈ కథనంలో కవిత పేరు ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ కేసులో కవితను విచారిస్తారనే ప్రచారం జరిగినా ఇప్పటి వరుకు అది జరగలేదు. తాజా కథనాల నేపథ్యంలో కవితను సైతం విచారించబోతున్నారా? అదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి సంచలనాలు బయటకు రాబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది.

Next Story