ఆ పరీక్ష రద్దు చేయాలి.. లేదంటే తెలంగాణ అగ్ని గుండమే: సర్కార్‌కు RSP వార్నింగ్

by Disha Web Desk 19 |
BSP Chief RS Praveen Kumar Says An acre of land for the poor if we are empowered
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసి కోట్ల రూపాయలకు ఉద్యోగాలను అమ్ముకున్నందుకు నిరుద్యోగులు తెలంగాణ సంబరాలు జరుపుకోవాలా అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం గన్‌పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామా కోసం వాళ్ళపై సీఎం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఒక్క నిమిషంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేస్తారని అన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు సీఎం కార్యాలయంలో ఉన్నారని ఆరోపించారు.

సిట్, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ప్రస్తుత టీఎస్పీఎస్సీ బోర్డుతోనే జూన్ 11న నిర్వహించే గ్రూప్ -1 పరీక్షను రద్దు ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ అగ్ని గుండం అవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న బోర్డుతో నిరుద్యోగులకు న్యాయం జరగదన్న ఆయన.. గ్రూప్ -1 పరీక్షను స్వచ్ఛందంగా నిరుద్యోగులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు నెరవేర్చకుండానే రూ.105 కోట్ల ప్రజాధనంతో కేసీఆర్ సంబరాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలను చూడలేకనే బీఎస్పీ అధినేత్రి మాయావతి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 36 మంది బీఎస్పీ ఎంపీలు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణనేనన్న ఆయన సామాజిక తెలంగాణ సాధించేందుకు మరో పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలాన్నారు.

తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్.. లిఫ్ట్ ఇరిగేషన్, లిక్కర్ స్కామ్‌ల తెలంగాణగా మార్చారని విమర్శించారు. పాలమూరులో వలసలు ఆగాయని చెప్పిన ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. పాలమూరులో నేటికి వలసలు కొనసాగుతున్నాయని.. దమ్ముంటే కేసీఆర్ నాతో పాలమూరు జిల్లాకు రండి, పాలమూరు వలసలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు మిగిలాయాన్న ఆయన.. కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం గుప్త నిధులుగా మారాయన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే తెలంగాణ బందీగా ఉందన్న ఆయన కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా మార్చేంతవరకు బీఎస్పీ నిరంతరం పోరాడుతుందన్నారు.


Next Story

Most Viewed