నీళ్ల కోసం రోడ్లపైకే రావడమే లేదంటిరి.. మరి ఇదేంటి?: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆకునూరి మురళి ఫైర్

by Dishafeatures2 |
నీళ్ల కోసం రోడ్లపైకే రావడమే లేదంటిరి.. మరి ఇదేంటి?: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆకునూరి మురళి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అందరికీ నీళ్లు ఇవ్వడంలో విఫలం అయిందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు. కొన్ని గ్రామాల్లో నల్లా కనెక్షన్లు ఇచ్చినా అందులో నీళ్లు రావడం లేదని అందువల్ల నీళ్ల కోసం ప్రజలు ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారని విమర్శించారు. నల్లా నీళ్లు రాకపోవడంతో చేతి పంపు వద్ద నీళ్లు తీసుకువెళ్తున్న మహిళలకు సంబంధించిన ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. తెలంగాణలో మహిళలు నీళ్ల కోసం బిందెలు పట్టుకుని రోడ్లపైకి రావడం మర్ఛిపోయారని అందరికి నల్లా నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథ పేరుతో ఎనిమిదేళ్లుగా కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం కింద లక్షా 20 వేల కోట్లు ఖర్చు పెట్టి 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 3 లక్షల ఎకరాలకే నీళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ అద్భుతంగా చూపిస్తున్నారని ఈ ప్రాజెక్టుపై అమెరికా నెవెడాలో సివిల్ ఇంజినీర్లకు ఏం చెబుతారని ధ్వజమెత్తారు. 25,000 వచ్చే పంటకు లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెబుతారా అని ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed