ఈ వార్డెన్ ఉంటే మేము చచ్చిపోతాం...

by Disha Web Desk 20 |
ఈ వార్డెన్ ఉంటే మేము చచ్చిపోతాం...
X

దిశ ప్రతినిధి, వికారాబాద్, బషీరాబాద్ : విద్యార్థులు త్వరగా లేవడం లేదని పనిష్మెంట్ పేరుతో ఓ హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు కఠినమైన శిక్ష విధించింది. ఉదయం 7 గంటలకే పెట్టాల్సిన అల్పాహారాన్ని మధ్యాహ్నం 12 అయినా పెట్టకుండా విద్యార్థులను ఆకలితో అలమటించేలా చేసింది. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా, బషీరాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న బాలికల బీసీ హాస్టల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉండడం, మిగతా విద్యార్థులకు స్కూల్ లేకపోవడంతో విద్యార్థులు కొంత ఆలస్యంగా నిద్రలేచారు.

ఏదో భయపెట్టి బెదిరించి పిల్లల్ని నిద్రలేపి చదివించాల్సిన వార్డెన్ శశిరేఖ విద్యార్థుల పై తన ప్రతాపం చూపించి. శుక్రవారం మధ్యాహ్నం 12 అయినా అన్నం పెట్టకుండా, తాగడానికి నీళ్లు ఇవ్వకుండా మృగంలా ప్రవర్తించిందని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆకలితో కడుపు నొస్తుంది మేడం అని ఎన్నిసార్లు కాళ్ల మీద పడ్డా కనికరించలేదని కన్నీరు మున్నీరయ్యారు. భోజనం అడిగితే ఆ వార్డెన్ భయపెట్టి కొట్టింది అని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకొని వార్డెన్ ను ప్రశ్నించగా తాను ఏమి తప్పు చేయలేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు.

ఈ వార్డెన్ మాకొద్దు కన్నీళ్లు పెట్టుకుంటున్న విద్యార్థులు..

ఈ సమస్య కేవలం ఈ రోజుది మాత్రమే కాదని ప్రతిరోజు పనిష్మెంట్ పేరుతో మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయం తెలియగానే జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్ హాస్టల్ కి చేరుకొని ఏం జరిగిందని పిల్లలని అడిగి తెలుసుకోగా, వార్డెన్ చేసిన తప్పులని విద్యార్ధులు అధికారికి వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పిల్లల తల్లిదండ్రులు, చివరికి జిల్లా అధికారి సైతం వార్డెన్ ను ప్రశ్నించడంతో ఉద్యోగం పోతుంది అన్న భయంతోనో, మరి ఇతర కారణంతోనో వార్డెన్ శశిరేఖ ఉరివేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

ఉరి వేసుకున్న శశిరేఖను వెంటనే కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ వార్డెన్ మాకు వద్దు, ఈమె ఉంటే మేము అందరం చచ్చిపోతాం అంటూ బాలికలు కన్నీళ్లు పెట్టడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాన్స్ఫర్ లేదా సస్పెండ్ చేస్తామని జిల్లా అధికారి ఉపేందర్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం : బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్

పనిష్మెంట్ పేరుతో బీసీ హాస్టల్ వార్డెన్ శశిరేఖ విద్యార్థులకు మధ్యాహ్నం 12 అయినా టిఫిన్ పెట్టలేదని తెలియగానే హాస్టల్ కు చేరుకున్నామని తెలిపారు బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్. జరిగిందంతా విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని, వార్డెన్ ను ప్రశ్నించగా తప్పు ఒప్పుకున్నారని తెలిపారు. అంతలోనే మనస్థాపానికి గురైన ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా విద్యార్థులు, స్థానికులు కాపాడారన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. తప్పు చేసినట్లు నిర్ధారణ అయింది కాబట్టి విద్యార్థులు కూడా ఆ వార్డెన్ వద్దు అంటున్నారని, ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వార్డెన్ పై చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి ఉపేందర్ వెల్లడించారు.



Next Story

Most Viewed