సౌతిండియాకు తెలంగాణ గేట్ వే: రాజ్‌నాథ్ సింగ్

by Disha Web Desk 2 |
సౌతిండియాకు తెలంగాణ గేట్ వే: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ భారతదేశానికి తెలంగాణ ‘గేట్ వే’ లాంటిదని, ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడి స్థిరమైన అభివృద్ధి జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో అప్పట్లో బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు పలికిందని, కానీ పదేండ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ చివరకు ప్రజా ధనాన్ని లూటీ చేసిందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పై కామెంట్లు చేశారు. మోడీ హయాంలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, యావత్తు ప్రజానీకం కేంద్ర ప్రభుత్వంవైపు చూశారని, అభివృద్ధిలో రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మోడీ పాలన గుర్తింపు తెచ్చుకున్నదన్నారు.

మోడీ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక నమ్మకం, భరోసా ఏర్పడిందని, అందువల్లనే ఆయన హయాంలో దేశం సురక్షితంగా ఉంటుందనే విశ్వాసం నెలకొన్నదన్నారు. రాబోయే ఐదేండ్లలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకనామీ కలిగిన దేశంగా తయారవుతుందన్నారు. దీర్ఘకాలంగా ప్రజల సెంటిమెంట్‌గా, చిరకాల కోరికగా ఉన్న రామమందిరం సాకారమైందని, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయిందని, ట్రిపుల్ తలాక్ కూడా రద్దు కావడంతో ముస్లిం సమాజ మహిళలకు విముక్తి లభించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదరికం పెరిగిపోతే మోడీ పాలనలో మాత్రం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ దిశగా దేశం దూసుకుపోతున్నదన్నారు. పేదరికం నుంచి 15 కోట్ల మంది ప్రజానీకం బైటపడ్డారని గుర్తుచేశారు.

రక్షణ రంగంలో మన దేశం సొంత కాళ్ళపై నిలబడే స్థాయికి చేరుకుంటున్నదని, అన్ని అవసరాలనూ వీలైనంతగా ఇక్కడే ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నామని, టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ కూడా ఒకటిగా నిలుస్తూ ఉన్నదన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ సాధ్యమైందన్నారు. ఈటల రాజేందర్ తెలంగాణ ఆర్థిక మంత్రిగా మంచి పనితీరు కనబరిచారని, ఆయనను మల్కాజిగిరి అభ్యర్థిగా గెలిపించుకోవడం ఆ ప్రాంత ప్రజలకే ప్రయోజనం కలిగిస్తుందన్నారు. సికింద్రాబాద్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కిషన్‌ రెడ్డిని కూడా గెలిపించుకోవడం అవసరమని, రానున్న రోజుల్లో కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ధి సంపూర్ణ సహాయ సహకారాలు అందడానికి దోహదపడుతుందన్నారు.

Read More...

మిరపకాయ ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed