గవర్నర్‌కు మళ్లీ అవమానం.. వరంగల్ టూర్‌లో నో ప్రోటోకాల్!

by Disha Web Desk 2 |
గవర్నర్‌కు మళ్లీ అవమానం.. వరంగల్ టూర్‌లో నో ప్రోటోకాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్‌కు, ప్రభుత్వానికి గ్యాప్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మరోసారి గవర్నర్ టూర్‌లో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం నిమిత్తం వరంగల్ జిల్లాకు గవర్నర్ తమిళిసై వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు కలెక్టర్, కమిషనర్ దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. KU గెస్ట్ హౌస్ దగ్గర ఆర్డీవో, వీసీ గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఇటీవల గవర్నర్ పర్యటనల్లో తరచూ ప్రోటోకాల్ వివాదం తెరపైకి వస్తూనే ఉంది. నిబంధలన ప్రకారం గవర్నర్ వస్తే కలెక్టర్లు, ఎస్పీలు స్వాగతం పలకాల్సి ఉన్నా ఆ మేరకు వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ అతిగా జోక్యం చేసుకుంటున్నారని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా తన పరిమితుల మేరకే తాను నడుచుకుంటున్నానని గవర్నర్ చెబుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రాజ్ భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఏటా రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అయితే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. తాజాగా ఇవాళ జరిగే కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవానికి గవర్నర్ వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు స్వాగతం పలికేందుకు కలెక్టర్, కమిషనర్ హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇవాళ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో 56 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 276 మందికి బంగారు పతకాలను గవర్నర్ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమాలన్నింటిని ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ కేయూ నుండి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం అవుతారు.


Next Story

Most Viewed