తెలంగాణపై ప్రధాని మోడీ ట్వీట్! హరీష్ రావు సెటైర్లు

by Disha Web Desk 4 |
తెలంగాణపై ప్రధాని మోడీ ట్వీట్! హరీష్ రావు సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటన హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికల ఏడాదిలో మోడీ వస్తుండటంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రధాని చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. 8వ తేదీన బీబీ నగర్ ఎయిమ్స్ కు శంకుస్థాపన చేయబోతున్న ప్రధాని 'బీబీ నగర్ లో ఎయిమ్స్ లో మౌళిక సదుపాయాలను పెంపొందించడం తెలంగాణకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. అలాగే ఆరోగ్యవంతమైన భారత దేశాన్ని సృష్టించేందుకు చేస్తున్న మా ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి' అని ట్వీట్ చేశారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ కు ప్రతిస్పందనగా ప్రధాని పై విధంగా స్పందించారు. అంతకు ముందు మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ చేస్తూ తెలంగాణ హెల్త్ కేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను కొత్త స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా బీబీనగర్ లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ను ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని, బీబీనగర్ ఎయిమ్స్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓ సారి చూడండి అంటూ ఊహా చిత్రాలు షేర్ చేశారు.

కాగా ప్రధాని ఎయిమ్స్ శంకుస్థాపన అంశంపై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. ‘ప్రధాని తెలంగాణకు వస్తాడట. ఎయిమ్స్‌లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజ్ వస్తే ఇప్పుడు కొబ్బరికాయ కొడతాడట. ఒక్క మెడికల్ కాలేజీకి నాలుగేళ్ల తర్వాత కొబ్బరికాయ కొడితే, మేము గత ఏడాది కాలంలోనే ఎనిమిది మెడికల్ కాలేజీలకు కొబ్బరికాయలు కొట్టాం. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నామన్నారు. ఒక్క మెడికల్ కాలేజీకి కొబ్బరికాయ కొడితేనే భూమి ఆకాశం ఒక్కటైనంతగా బీజేపీ నేతలు డబ్బా కొట్టుకుంటుంటే ఇంత చేసిన మేము ఇంకెంత ప్రచారం చేసుకోవాలి’ అని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed