Phone Tapping Case: సిట్ నోటీసులిస్తే హాజరుకావాల్సిందే.. ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం

by Prasad Jukanti |

దర్యాప్తుకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Phone Tapping Case: సిట్ నోటీసులిస్తే హాజరుకావాల్సిందే.. ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) నోటీసులు ఇస్తే సిట్ ముందు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కావాల్సిందేనని, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు (Prabhakar Rao) బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని కేసు దర్యాప్తునకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్ర వాదనలు వినిపిస్తూ.. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఎలక్ట్రానిక్ పరికరాలు, సాక్ష్యాధారాలు ట్యాంపరింగ్ చేశారని కోర్టుకు వివరించారు. డేటా రికవరీకి ప్రభాకర్ రావు సహకరించట్లేదని తెలిపారు. ప్రభుత్వ ల్యాప్ టాప్, ఫోన్లలో ఉన్న డేటా కూడా ఫార్మాట్ చేశారని అందులో ఎలాంటి డేటా లేకుండా చేశారని తెలిపారు. అయితే ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది వాదన వినిపిస్తూ.. ప్రభాకర్ రావు పది సార్లు విచారణకు హాజరయ్యారని విచారణకుపూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం.. నోటీసులు ఇస్తే సిట్ ముందు ప్రభాకర్ రావు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించారు. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 22 కు వాయిదా వేసింది. ఈ కేసు దర్యాప్తు పూర్తికి మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

Next Story